మరో పరీక్ష పాస్ అయిన 'తండేల్'
చందు మొండేటి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన 'తండేల్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ.70 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
నాగ చైతన్య ఎట్టకేలకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన 'తండేల్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ.70 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. బుక్ మై షో లో ఈ సినిమా వరుసగా నాల్గవ రోజు అత్యధిక బుకింగ్ సొంతం చేసుకుంది. మొదటి మూడు రోజులు భారీ వసూళ్లు నమోదు చేయడంతో సాలిడ్ ఓపెనింగ్స్ను రాబట్టిన ఈ సినిమా నాల్గవ రోజు అయిన సోమవారం వసూళ్లు ఎలా ఉంటాయా అనే ఆసక్తి అందరిలోనూ కనిపించింది. అయితే సోమవారం సైతం సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. వీక్ డేస్లోనే స్ట్రాంగ్గానే తండేల్ నిలబడింది.
వీక్ డేస్లో సినిమాకి వసూళ్లు రాకుంటే వంద కోట్ల వసూళ్లు అసాధ్యం అయ్యేది. కానీ సోమవారం సాధించిన వసూళ్లను చూస్తూ ఉంటే కచ్చితంగా వచ్చే వీకెండ్ పూర్తి అయ్యేప్పటి వరకు తండేల్ సినిమాకు వంద కోట్ల పోస్టర్ పడటం ఖాయం అని అక్కినేని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. చిత్ర యూనిట్ సభ్యులు సైతం ఈ సినిమా వంద కోట్ల వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. వీక్ డేస్లోనూ బుక్ మై షో లో అత్యధిక బుకింగ్స్ నమోదు అయ్యాయి. సోమవారం ఏకంగా 73 వేలకు పైగా టికెట్లు బుక్ మై షో ద్వారా అమ్ముడు పోయాయి. టైర్ 2 స్టార్ హీరోల సినిమాలకు వీక్ డేస్లో ఈ స్థాయి బుకింగ్స్ నమోదు కావడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.
ఇప్పటి వరకు సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.70 కోట్లకు మించి గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఒకటి రెండు రోజుల్లో సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ను రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఫిబ్రవరి, మార్చి నెలలను అన్ సీజన్గా చెబుతూ ఉంటారు. అలాంటి అన్ సీజన్లో వచ్చిన తండేల్ సినిమాకు నమోదు అవుతున్న వసూళ్లు చూసి బాక్సాఫీస్ వర్గాల వారు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాలంటైన్స్ డేతో పాటు వీకెండ్లోనూ భారీ వసూళ్లు రాబట్టడం ఖాయం అని, నాగ చైతన్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా తండేల్ నిలవబోతుందనే విశ్వాసంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాలోని ప్రేమ కథకు అన్ని వర్గాల ప్రేక్షకుల ఫిదా అవుతున్నారు. ఒక రియల్ స్టోరీని తీసుకుని దాన్ని కమర్షియల్ యాంగిల్లోకి మార్చి ప్రేమ కథగా తండేల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన దర్శకుడు చందు మొండేటిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక వైపు రియల్ స్టోరీని చక్కగా నడిపిస్తూనే మరో వైపు రాజు, బుజ్జి తల్లి మధ్య ప్రేమను అద్భుతంగా చూపించాడు దర్శకుడు. కార్తికేయ 2 సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చందు మొండేటి ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటారు. ఈ విజయంతో చందు మొండేటి తదుపరి సినిమా స్టార్ హీరోతో ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.