రాజా సాబ్.. ఆడియో రేటు భారీగానే..

సాధారణంగా ఏ స్టార్ హీరో అయినా ఒక్క సినిమా చేయాలంటే చాలా కాలం పాటు సమయాన్ని తీసుకుంటున్నారు.

Update: 2024-10-21 09:58 GMT

సాధారణంగా ఏ స్టార్ హీరో అయినా ఒక్క సినిమా చేయాలంటే చాలా కాలం పాటు సమయాన్ని తీసుకుంటున్నారు. కానీ, ఇప్పుడు టాలీవుడ్‌లోని ఒకరిద్దరు మాత్రం వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ దూసుకెళ్తున్నారు. అందులో రెబెల్ స్టార్ ప్రభాస్ పేరు ముందుగా చెప్పుకోవాలి. అంతలా అతడు ఏకధాటిగా మూవీలను చేస్తూ జెట్ స్పీడుతో వెళ్తున్నాడు. ఇలా ఇటీవలే ‘‘కల్కి 2898 ఏడీ’తో బడా హిట్‌ను కొట్టేశాడు.

రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే చాలా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో ‘ది రాజా సాబ్’ మూవీ ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తోన్న ఈ సినిమా హర్రర్ కామెడీ కాన్సెప్టుతో రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రాకుండానే షూటింగ్‌ను చిత్ర యూనిట్ సీక్రెట్‌గా స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి పలు షెడ్యూళ్లను జరుపుకుని చాలా వరకూ షూట్ కంప్లీట్ చేసుకుంది.

ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘ది రాజా సాబ్’ సినిమా నుంచి అప్పుడప్పుడూ కొన్ని అప్‌డేట్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రం నుంచి ‘ఫ్యాన్ ఇండియా గ్లింప్స్’ వీడియో విడుదలైంది. దీనికి ప్రభాస్ అభిమానులే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించింది. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన బిజినెస్‌ వర్క్‌ను కూడా చిత్ర యూనిట్ షురూ చేసేసింది.

డిఫరెంట్ సబ్జెక్టుతో రూపొందుతోన్న ‘ది రాజా సాబ్’ సినిమాకు సంబంధించిన ఆడియో హక్కుల డీల్ తాజాగా ముగిసినట్లు తెలిసింది. వీటిని టీ సిరీస్ సంస్థ సొంతం చేసుకుందని కూడా న్యూస్ లీకైంది. అంతేకాదు, ఈ రైట్స్ కోసం సదరు సంస్థ ఏకంగా రూ. 25 కోట్లను నిర్మాతలకు ముట్టజెప్పినట్లు ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది. థమన్‌ మ్యూజిక్‌పై ఉన్న నమ్మకంతోనే టీ సిరీస్ ఇంత మొత్తం పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది.

గతంలో కంటే ఇప్పుడు వస్తున్న సినిమాల ఆడియో రైట్స్ కోసం బడా సంస్థలు భారీ మొత్తాలనే పెడుతున్నారు. ఇలా ‘పుష్ప 2’, ‘గేమ్ చేంజర్’ వంటి చిత్రాలకు సైతం రూ. 25 కోట్లు కంటే ఎక్కువ డీల్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ‘ది రాజా సాబ్’ సినిమాకు కూడా అదే మొత్తంలో హక్కులు అమ్ముడుపోయాయి. అందుకు తగ్గట్లుగానే థమన్ మంచి మాస్, క్లాస్ బీట్లతో సాంగ్స్ రెడీ చేస్తున్నాడని సమాచారం.

‘ది రాజా సాబ్’ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.

Tags:    

Similar News