పుష్పరాజ్ రూల్ ఒక్క రోజు ముందుగానే!

బ్లాక్ బస్టర్ 'పుష్ప: ది రైజ్' సీక్వెల్ గా తెరకెక్కుతున్న ''పుష్ప 2: ది రూల్'' సినిమా ప్రీపోన్ అయింది

Update: 2024-10-24 09:44 GMT

పుష్పరాజ్ జాతర ఒకరోజు ముందుగానే ప్రారంభం కాబోతోంది. బ్లాక్ బస్టర్ 'పుష్ప: ది రైజ్' సీక్వెల్ గా తెరకెక్కుతున్న ''పుష్ప 2: ది రూల్'' సినిమా ప్రీపోన్ అయింది. అవును.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా ముందుగా ప్లాన్ చేసిన సమయం కంటే ఒక్క రోజు ముందుగానే థియేటర్లలోకి రాబోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ అధికారికంగా ధృవీకరించారు. అభిమానుల కోరిక మేరకు 'పుష్ప 2' చిత్రాన్ని డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

''పుష్ప 2: ది రూల్'' చిత్రాన్ని 2024 డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ పాన్ ఇండియా సినిమాని డిసెంబర్ 5వ తారీఖునే థియేటర్లలో రిలీజ్ చెయ్యాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. డిసెంబర్ 4న ఓవర్సీస్ ప్రీమియర్‌లు పడతాయని తెలిపారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కు సంబంధించిన కొత్త పోస్టర్ ను పంచుకున్నారు. ఇందులో బన్నీ సిగార్ తాగుతూ, చేతిలో ఉన్న తుపాకీని చూస్తూ నిలబడి ఉన్నాడు.

నిజానికి 'పుష్ప 2' సినిమా ప్రీపోన్ అవుతుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా మేకర్స్ ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ''వేడుకలు ఒక రోజు ముందుగానే ప్రారంభమవుతాయి.. బాక్సాఫీస్ వద్ద బాణాసంచా ఒక రోజు ముందుగానే పేల్చివేయబడుతుంది.. ఒక రోజు ముందే రికార్డుల వేట జరుగుతుంది.. పుష్ప రాజ్ రూల్ ఒక రోజు ముందుగానే ప్రారంభమవుతుంది. బిగ్గెస్ట్ ఇండియన్ మూవీ 'పుష్ప: ది రూల్' డిసెంబర్ 5న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది'' అని పేర్కొన్నారు. మోస్ట్ అవైటెడ్ మూవీ ఒకరోజు ముందుగానే విడుదల కానుందని తెలియడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. నాలుగు రోజుల వీకెండ్ కలిసొస్తే, బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారంటీ అని కామెంట్స్ చేస్తున్నారు.

'పుష్ప 2: ది రూల్' చిత్రానికి సుకుమార్ బండ్రెడ్డి దర్శకత్వం వహించారు. పార్ట్-2 మీదున్న భారీ అంచనాలను దృష్టిలో పెట్టుకొని, ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని అనుభూతిని అందించడానికి జీనియస్ డైరెక్టర్ కృషి చేస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ, బ్రహ్మాజీ, సౌరభ్ సచ్ దేవా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శేషాచలం అటవీ ప్రాంతంలో కూలీగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన పుష్పరాజ్‌.. ఎర్రచందనం సిండికేట్‌ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది ‘పుష్ప ది రైజ్‌’ లో చూపించారు. ఆ తర్వాత పుష్పరాజ్‌ కి ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని అతను ఎలా ఎదుర్కొన్నాడు? ఎలా రూల్ చేశాడు? అనే ఆసక్తికరమైన అంశాలతో ''పుష్ప ది రూల్‌'' సినిమా రెడీ అవుతోంది. ఇందులో విజువల్స్, యాక్షన్, మ్యూజిక్.. ఇలా సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కటీ అద్భుతంగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి 'పుష్ప 2' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News