'పుష్ప' పార్ట్-3.. మైత్రీ నిర్మాత క్లారిటీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ బండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ''పుష్ప 2: ది రూల్‌''.

Update: 2024-10-24 10:55 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ బండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ''పుష్ప 2: ది రూల్‌''. ‘పుష్ప ది రైజ్‌’కు సీక్వెల్‌గా రాబోతున్న ఈ యాక్షన్ డ్రామా కోసం యావత్ సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే చిత్రాన్ని ముందుగా అనుకున్న డిసెంబర్ 6వ తేదీన కాకుండా, ఒక రోజు ముందుగా డిసెంబర్ 5వ తేదీనే విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్‌ గురువారం హైదరాబాద్ లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా 'పుష్ప 3' గురించి నిర్మాతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

'పుష్ప 2' కి కొనసాగింపుగా 'పుష్ప 3' కూడా ఉంటుందా? అని విలేఖరులు ప్రశ్నించగా.. ఉంటుందని మైత్రీ నిర్మాత వై. రవిశంకర్ కంఫర్మ్ చేసారు. 'పుష్ప 2: ది రూల్‌' చిత్రాన్ని ప్రేక్షకులు బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్ చేస్తే, తప్పకుండా పార్ట్-3 కూడా చేస్తామని తెలిపారు. సెకండ్ పార్ట్ ఎండింగ్ లోనే 'పుష్ప 3' చిత్రానికి లీడ్ కచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. నిర్మాత చెప్పిన దాన్ని బట్టి చూస్తే 'పుష్ప' చిత్రాన్ని ఫ్రాంచైజీగా తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.

గతంలో అల్లు అర్జున్ సైతం 'పుష్ప 3' గురించి హింట్ ఇచ్చారు. 74వ బెర్లిన్‌ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి అల్లు అర్జున్ జర్మనీకి వెళ్లినప్పుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పార్ట్-3 ని ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చని అని చెప్పారు. 'పుష్ప' సినిమాని ఫ్రాంచైజీగా మార్చాలనుకుంటున్నామని, ఈ లైనప్ కోసం అద్భుతమైన ఐడియాలు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు తాజాగా నిర్మాత రవిశంకర్ సైతం 'పుష్ప' పార్ట్-3 ఉంటుందనే విషయాన్ని ధ్రువీకరించారు. ఈ ప్రకటనతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ 'పుష్ప: ది రైజ్‌' తెరకెక్కింది. కోవిడ్ పాండమిక్ తర్వాత 2021 డిసెంబర్ లో రిలీజైన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. థియేటర్లలోనే కాదు, ఓటీటీలోనూ సంచలన విజయం సాధించింది. పుష్పరాజ్ గా బన్నీ నటనకు పాన్ ఇండియా వైడ్ గా ప్రశంసలు దక్కాయి. తగ్గేదేలే అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ ట్రెండ్ గా మారిపోయాయి. ఈ చిత్రానికి గాను అల్లు అర్జున్‌ 'ఉత్తమ నటుడి'గా నేషనల్ ఫిలిం అవార్డ్ సాధించారు. అందుకే 'పుష్ప: ది రూల్' పై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే ''పుష్ప 2: ది రూల్‌'' ట్రైలర్ ను, రెండు పాటలను నవంబర్ నెలలో రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. సినిమాలో జాతర ఎపిసోడ్ ఒక మాస్టర్ పీస్ అని, గూస్ బమ్స్ వస్తాయని చెప్పారు. ఈ ఎపిసోడ్ కోసం 15-20 రోజులు రిహాసల్స్ చేసి, 35 రోజులు షూట్ చేశామని వెల్లడించారు. అల్లు అర్జున్, సుకుమార్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని.. జాతర ఎపిసోడ్ కోసం బన్నీ పడిన కష్టాన్ని దేనితోనూ పోల్చలేమని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News