240 కోట్ల ఆస్తితో దేశంలో టాప్ గాయ‌ని

త‌న‌ మొదటి స్టూడియో ఆల్బమ్ `బెంధెచ్చి బీనా` జనవరి 1998లో 14 బాణీల‌తో విడుదలైంది.

Update: 2024-03-15 13:30 GMT

ఇప్పటివరకు 3000కి పైగా పాటలు పాడిన గాయని.. 16 సంవత్సరాల వయస్సులో తన కెరీర్ లో ఉత్త‌మ స్థాయికి చేరుకుని ఆశ్చ‌ర్య‌ప‌రిచిన మేటి ప్ర‌తిభావ‌ని.. నేడు భారతదేశంలోని అత్యంత ధనిక గాయనీమ‌ణుల్లో ఒకరు. తాజా క‌థ‌నాల‌ ప్రకారం.. శ్రేయా ఘోష‌ల్ నికర ఆస్తి విలువ రూ. 240 కోట్లు. స‌ద‌రు గాయ‌ని 1984లో పశ్చిమ బెంగాల్‌ ముర్షిదాబాద్‌లోని బెర్హంపూర్‌లో బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. త‌న‌ మొదటి స్టూడియో ఆల్బమ్ `బెంధెచ్చి బీనా` జనవరి 1998లో 14 బాణీల‌తో విడుదలైంది.


ఈ మేటి గాయని మరెవరో కాదు శ్రేయా ఘోషల్. శ్రేయా రియాలిటీ షో నుండి తన మొదటి బ్రేక్ పొందింది. పదహారేళ్ల వ‌య‌సులో టెలివిజన్ సింగింగ్ రియాలిటీ షో `స రే గామా`లో గెలిచిన తర్వాత ద‌ర్శ‌క‌నిర్మాత సంజయ్ లీలా భ‌న్సాలీ తల్లి గారి దృష్టిలో ప‌డింది. శ్రేయా ఘోషల్ 2002లో భ‌న్సాలీ `దేవదాస్` చిత్రంతో పెద్ద బ్రేక్‌ను పొందింది. దాని కోసం ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా అందుకుంది.

భార‌త‌దేశంలో ఎంద‌రో గొప్ప గాయ‌నీమ‌ణులు .. సునిధి చౌహాన్, నేహా కక్కర్ ఇప్పుడు భారతదేశంలోని అగ్రశ్రేణి మహిళా గాయకులుగా చ‌రిత్ర‌కెక్కారు. లెజెండరీ ఆశా భోంస్లే దశాబ్దాలుగా పాడుతున్నారు. భారతీయ సంగీత పరిశ్రమలో ఆమె తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. వీళ్లంద‌రికీ ధీటుగా రాణించి ఐశ్వ‌ర్యంలోను మేటి గాయ‌నిగా శ్రేయా ఘోష‌ల్ పేరు పాపుల‌రైంది.

శ్రేయా ఘోషల్ ఇప్పటివరకు హిందీ, బెంగాలీ, అస్సామీ, భోజ్‌పురి, తెలుగు, తమిళం, ఒరియా, గుజరాతీ, కన్నడ, మరాఠీ, మలయాళం, నేపాలీ మరియు అనేక ఇతర భాషలలో పాడింది. ఆరేళ్ల వయసులో శ్రేయా ఘోషల్ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందింది. దివంగత కళ్యాణ్‌జీ భాయ్ వ‌ద్ద‌ 18 నెలల పాటు శిక్షణ పొందింది. ముంబైలోని లేట్ ముక్తా భిడేతో తన శాస్త్రీయ సంగీత శిక్షణను కొనసాగించింది.

2017లో ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోని భారతీయ విభాగంలో తన మైనపు బొమ్మను ప్రదర్శించారు. ఇలాంటి అదృష్టం ద‌క్కించుకున్న‌ మొదటి భారతీయ గాయని శ్రేయా ఘోషల్. USలోని ఒహియో రాష్ట్రం కూడా ఈ మేటి ప్ర‌తిభావ‌నిని గౌరవించింది. అక్కడ గవర్నర్ టెడ్ స్ట్రిక్‌ల్యాండ్ 26 జూన్ 2010ని శ్రేయా ఘోషల్ డేగా ప్రకటించారు. ఫోర్బ్స్ విడుదల చేసిన భారతదేశపు టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో శ్రేయా ఐదుసార్లు చోటు దక్కించుకున్నారు.

శ్రేయా ఘోషల్ నికర ఆస్తి విలువ రూ. 240 కోట్లుగా ఉంది. త‌న సీనియ‌ర్ గాయ‌నీమ‌ణుల ఆస్తులు నిరంత‌రం చ‌ర్చ‌నీయాంశం. సునిధి చౌహాన్ నికర ఆస్తి విలువ రూ. 100 కోట్లకు పైగా ఉండగా, ఆశా భోంస్లే నికర ఆస్తుల విలువ రూ. 80 కోట్లకు పైగా ఉన్నట్లు క‌థ‌నాలొస్తున్నాయి. సింగింగ్ సెన్సేషన్ నేహా కక్కర్ ఆస్తి విలువ దాదాపు రూ.40 కోట్లు అని సమాచారం. వీళ్లంద‌రి కంటే గాయ‌ని తుల‌సి కుమార్ ఆస్తి విలువ ఎక్కువ‌. సుమారు 300 కోట్లు.

Tags:    

Similar News