ఆమె ఒకే గదిలో 50 మందితో కలిసి ఉందట!

రణబీర్ కపూర్ హీరోగా సందీప్‌ వంగ దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్‌' సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటించిన విషయం తెల్సిందే.

Update: 2024-09-20 15:30 GMT

రణబీర్ కపూర్ హీరోగా సందీప్‌ వంగ దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్‌' సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటించిన విషయం తెల్సిందే. అయితే రష్మిక మందన్న కంటే ఎక్కువ గుర్తింపు, ఆధరణ సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ త్రిప్తి డిమ్రి. యానిమల్ లో త్రిప్తి కనిపించేది కొద్ది సమయం మాత్రమే అయినా ఎక్కువ శాతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. రణబీర్ కపూర్ తో ఆమె చేసిన రొమాంటిక్ సన్నివేశాలు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. అందుకే సినిమాకు మంచి స్పందన యూత్‌ నుంచి దక్కింది అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం. తాజాగా ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది.

సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమయంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న. ఆఫర్లు రాకపోవడంతో తిరిగి వెళ్లాలని భావించాను అంది. త్రిప్తి మాట్లాడుతూ... ఉత్తరాఖండ్‌ కు చెందిన మేము కొన్ని కారణాల వల్ల ఢిల్లీ కి మారాం. ఫ్యామిలీతో కలిసి ఢిల్లీ లోనే పెరిగిన నేను సినిమాల్లో యాక్టింగ్‌ చేయాలనే ఆసక్తితో ముంబాయి చేరుకున్నాను. ముంబాయి కి వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా ఉండటానికి రూం ఇబ్బందిగా ఉండేది. ఒకే రూంలో 50 మందితో కలిసి ఉండేదాన్ని. అంత మందితో ఉండలేక వెనక్కి వెళ్లాలి అనుకున్న సందర్భాలు ఉన్నాయి.

ప్రతి రోజు వర్క్ కోసం బయటకు వెళ్లి ప్రయత్నాలు చేసేదాన్ని. అవకాశాలు రాకపోవడంతో రూంకు వచ్చి బాధ పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం సాధ్యం కాకపోవచ్చు అనే ఉద్దేశ్యంతో కొన్ని సార్లు ఢిల్లీ తిరిగి వెళ్లాలి అనుకున్నాను. కానీ మనసు ఒప్పుకోక పోవడంతో ప్రయత్నాలు కొనసాగిస్తూ వెబ్‌ సిరీస్ లో ఛాన్స్ దక్కించుకున్నాను. ఆ తర్వాత రణబీర్‌ కపూర్‌ సినిమాలో ఛాన్స్ అనడంతో చాలా సంతోషపడ్డాను. కానీ చాలా కాలం వరకు పిలుపు లేకపోవడంతో సినిమాలో నేను ఉండనేమో అనుకున్నాను. అంతే కాకుండా ఇండస్ట్రీ లో నాకు ముందు ముందు కూడా ఆఫర్లు రావేమో అనుకున్నాను.

ముంబాయికి వచ్చిన కొత్తలో నా ఫ్యామిలీ మెంబర్స్ తో బంధువులు కొందరు సినిమా ఇండస్ట్రీ అవసరమా అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. నా గురించి చెడుగా చెప్పి వెనక్కి రప్పించే ప్రయత్నం చేశారు. కానీ నేను సినిమా ల్లో నటించడం మొదలు పెట్టిన తర్వాత నా కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తప్పకుండా నేను రాణిస్తాను అనే నమ్మకం పెంచుకున్నారు. నా కుటుంబ సభ్యులు నా పట్ల గర్వంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. యానిమల్‌ సినిమా కంటే ముందు పలు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కనిపించి ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాల ఫలితం, కష్టానికి ప్రతిఫలం యానిమల్‌ సినిమా. ప్రస్తుతం బాలీవుడ్‌ లో త్రిప్తి మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌. భవిష్యత్తులో సౌత్‌ లోనూ ఈమె నటిస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News