జగన్ ఉండడమే బాబుకు సేఫ్ నా ?

వైసీపీ కనుక పొలిటికల్ తెర మీద అంతర్ధానం అయితే అపుడు బీజేపీ రాజకీయ త్రివిక్రమావతారం తో ముందుకు రావడం ఖాయమే అంటున్నారు.

Update: 2024-09-25 03:34 GMT

రాజకీయాలో ప్రత్యర్థులు కూడా అవసరం. వారే ఎదుటి పక్షానికి బలంగా కూడా అవుతూంటారు. ఇది కూడా ఒక రివర్స్ థియరీ. గతంలో చూస్తే చాలా రాష్ట్రాలలో రెండు పార్టీల వ్యవస్థ సాగేది. రాజకీయ ఆట రెండు పార్టీలే ఆడుకునేవి. మధ్యలో మూడవ పక్షం రాకుండా జాగ్రత్త పడేవి.

అలా తమిళనాడుని మంచి ఉదాహరణగా చెప్పుకోవాలి. డీఎంకే, లేకపోతే అన్నా డీఎంకే దశాబ్దాల రాజకీయం ఈ రెండు పార్టీల మధ్యనే సాగింది. ఉమ్మడి ఏపీలో కూడా కాంగ్రెస్ టీడీపీ అంతే. మధ్యలో కొత్త పార్టీలు పుట్టినా పుటుక్కుమనేవి.

ఇక విభజన తరువాత తెలంగాణాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య రాజకీయ పోరు రంజుగా సాగింది. మధ్యలో బీజేపీ దూరింది. దానికి కారణం బీఆర్ఎస్ అధినాయకత్వం అనుసరించిన విధానమే అని అంటున్నారు. కాంగ్రెస్ ని వీక్ చేయాలని కేసీఆర్ చేసిన రాజకీయం మూలంగా మధ్యలో బీజేపీ పుంజుకుందని అంటున్నారు.

దాతో ఇపుడు ట్రయాంగిల్ గా తెలంగాణా పోరు సాగుతోంది. బీజేపీ స్ట్రాటజీస్ వర్కౌట్ అయితే బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీని కూడా మింగేసే ప్రమాదం ఉంది అని అంటున్నారు. ఏపీలో చూస్తే బీజేపీకి అంత పొలిటికల్ స్పేస్ లేదు కానీ ఆ పార్టీ ఆశలు మాత్రం తారస్థాయిలో ఉన్నాయి.

ఏపీలో కూటమి కట్టి ప్రభుత్వంలో పాత్ర తన వంతుగా బీజేపీ పోషిస్తున్నా మూడు ప్రాంతీయ పార్టీలలో ఏది వీక్ అయితే ఆ స్పేస్ లోకి దూరాలని వ్యూహాలు గట్టిగానే చేస్తోంది. గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నపుడు పరోక్షంగా ఆ పార్టీకి సహకరించి టీడీపీ తగ్గిపోతే తాను బలపడాలనుకుంది.

కానీ అది వర్కౌట్ కాలేదు. ఇపుడు వైసీపీ విపక్షంలోకి వచ్చింది. జనసేన టీడీపీ మిత్రులు కాబట్టి వాటితో కలసి వైసీపీని వీక్ చేసే ప్రోగ్రాం బాగానే జరుగుతోంది. అయితే ఏపీలో చూసుకుంటే ప్రాంతీయ పార్టీలైన టీడీపీ వైసీపీ జనసేనలకే ఎక్కువ బలం ఉంది.

జాతీయ పార్టీలైన బీజేపీ పొత్తులతోనే పవర్ చూపిస్తోంది. కాంగ్రెస్ అయితే జాతీయ పార్టీగా ఉన్నా నామమాత్రం అయింది. వామపక్షాలు అలాగే ఉన్నాయి. ఇక ఏపీలో వైసీపీని లేకుండా చేయాలని కూటమి గట్టిగానే చూస్తోంది. అది కనుక సక్సెస్ అయితే వైసీపీ రాజకీయ తెరపైన బాగా తగ్గిపోతే ఎవరికి మేలు ఎవరికి చేటు అన్న చర్చ కూడా ఉంది.

ఏపీలో వైసీపీ బలంగా ఉన్నంతసేపే జనసేన అయినా బీజేపీ అయినా టీడీపీకి సపోర్ట్ గా ఉంటాయన్న విశ్లేషణలు ఉన్నాయి. వన్స్ వైసీపీ వీక్ అయిపోతే కచ్చితంగా ఆ స్పేస్ లోకి జనసేన బీజేపీ ప్రవేశించేందుకు చూస్తాయని, బీజేపీ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడితే ఏపీలో బాగా నిలదొక్కుంటే మాత్రం అది అంతిమంగా ప్రాంతీయ పార్టీలకే తీరని నష్టం అని అంటున్నారు.

కర్నాటకలో ప్రాంతీయ పార్టీల ఆసరాతో కాలు పెట్టిన బీజేపీ ఇపుడు బలమైన శక్తిగా మారింది. అలాగే తెలంగాణలో కూడా తన బలాన్ని పెంచుకుంది. ఏపీలో కూడా అదే పాలిటిక్స్ ని ప్లే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ ఒకసారి అడుగు పెట్టిన రాష్ట్రంలో బలపడిందే తప్ప తగ్గిన దాఖలాలు లేవు.

పైగా జాతీయ పార్టీ కూడా కావడం ఆరెస్సెస్ బలం బీజెపీకి భారీ అడ్వాంటేజ్ గా ఉంటాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల మధ్య రాజకీయ ఘర్షణలు బీజేపీకి ఏపీలో వరాలుగా మారుతాయని అంటున్నారు. వైసీపీ కనుక పొలిటికల్ తెర మీద అంతర్ధానం అయితే అపుడు బీజేపీ రాజకీయ త్రివిక్రమావతారం తో ముందుకు రావడం ఖాయమే అంటున్నారు. సో ఏపీ పాలిటిక్స్ లో ప్రాంతీయ పార్టీల మధ్యనే రాజకీయ సమరం ఎప్పటికీ సేఫ్ అని అంటున్నారు.

Tags:    

Similar News