ఎమ్మెల్యేకి అత్యంత విలువైన కారు గిఫ్ట్‌ ఇచ్చిన జన సైనికులు!

సాధారణంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర రాజకీయ నేతలు ఖరీదైన కార్లలో తిరుగుతుంటూరు.

Update: 2024-07-02 07:16 GMT

సాధారణంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర రాజకీయ నేతలు ఖరీదైన కార్లలో తిరుగుతుంటూరు. సాధారణ నేతలు కూడా ఈ రోజుల్లో కార్లలో తిరగనివారెవరూ లేరంటే అతిశయోక్తి కాదు.

అయితే ఎమ్మెల్యే అయినా సొంత కారు లేని వ్యక్తికి పార్టీ కార్యకర్తలే విలువైన కారును గిఫ్టుగా ఇవ్వడం హాట్‌ టాపిక్‌ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నుంచి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి చిర్రి బాలరాజు పోటీ చేశారు. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.

కాగా పోలవరం ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గం. జనసేన అభ్యర్థి బాలరాజు కూడా ఎస్టీ కమ్యూనిటీకి చెందినవారు. ఆయన ఎన్నికల ముందు వరకు జనసేనలో సామాన్య కార్యకర్తగా ఉండేవారు. అంతేకాకుండా జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ కు వీరాభిమాని.

ఎన్నికల్లో పోలవరం ఎస్టీ రిజర్వుడ్‌ స్థానం నుంచి జనసేన సీటును బాలరాజు దక్కించుకున్నారు. పలువురు పోటీ పడ్డా సీటు దక్కించుకుని విజయం సాధించారు. అయితే అంతకుముందు వరకు సాధారణ కార్యకర్త మాత్రమే అయిన బాలరాజుకు సొంత కారు లేదని సమాచారం.

Read more!

ఈ నేపథ్యంలో జన సైనికులు, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు అంతా కలిపి విరాళాలు పోగేశారు. ఆ డబ్బులతో తమ ఎమ్మెల్యే బాలరాజు విలువైన ఫార్చ్యూనర్‌ కారును గిఫ్టుగా అందజేశారు.

2019లో పోలవరం నుంచి పోటీ చేసిన బాలరాజు ఎన్నికల్లో ఓడిపోయారు. పోలవరం నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉంది. 2012, 2019ల్లో వైసీపీ అభ్యర్థి తెల్లం బాలరాజు విజయం సాధించారు. ఈసారి ఆయన భార్య రాజ్యలక్ష్మి వైసీపీ తరఫున బరిలోకి దిగారు. సర్వేలు, పలు ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా పోలవరంలో వైసీపీదే గెలుపుని తేల్చాయి. అయితే జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు విజయ ఢంకా మోగించారు.

ఈ నేపథ్యంలో వైసీపీ కంచుకోటగా ఉన్న పోలవరం సీటును దక్కించుకున్న బాలరాజుకు జనసైనికులు మర్చిపోలేని గిఫ్టును అందజేశారు. ఆర్థిక పరిస్థితుల రీత్యా కారు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్న ఆయనకు పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు, జనసైనికులు ఫార్చ్యూనర్‌ కారును అందించారు.

ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Tags:    

Similar News