జగన్ సీటు డిసైడ్ చేసేది ఆయనే ?

జగన్ పార్టీ దారుణంగా ఈ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆయనకు అసెంబ్లీలో ఎక్కడ చోటిస్తారు అన్నది ఇపుడు అత్యంత ఉత్కంఠను కలిగించే విషయంగా ఉంది.

Update: 2024-06-11 02:30 GMT

తాజా ఎన్నికల్లో 175 ఎమ్మెల్యే అలాగే పాతిక ఎంపీ అభ్యర్ధుల సీట్లను డిసైడ్ చేసిన జగన్ సీటు ఎక్కడ అనేది ఆయన నిర్ణయిస్తారు అని అంటున్నారు. జగన్ పార్టీ దారుణంగా ఈ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆయనకు అసెంబ్లీలో ఎక్కడ చోటిస్తారు అన్నది ఇపుడు అత్యంత ఉత్కంఠను కలిగించే విషయంగా ఉంది.

ఈసారి అసెంబ్లీలో జగన్ అపొజిషన్ బెంచ్ లలో కూర్చోవాల్సి ఉంటుంది. అయితే ఆయన పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ప్రజానీకం ఇవ్వలేదు. కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. 18 సీట్లు ఉంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటారు.

దాంతో పాటు ప్రోటోకాల్ ఉంటుంది. అలాగే కేబినెట్ ర్యాంక్ హోదా కూడా ఉంటుంది. అనేక అలవెన్సులు ఉంటాయి. అయితే దేశంలో ఈ విధంగా 151 సీట్లతో గెలిచిన ఒక ముఖ్యమంత్రి కేవలం 11 సీట్లకే పరిమితం కావడం ఎక్కడా జరగలేదు. దాంతో జగన్ కు అసెంబ్లీలో సీటు ఎక్కడ ఆయనకు ఏ వరసను కేటాయిస్తారు అన్నది చర్చగా ఉంది.

ఇదిలా ఉంటే ఈసారి అసెంబ్లీలో టీడీపీ జనసేన బీజేపీ ఉంటాయి. ఈ మూడూ కూటమి కట్టి అధికారంలో ఉంటాయి. ఈ మూడు పార్టీలు ట్రజరీ బెంచెస్ వైపు ఉంటే అపొజిషన్ లో జగన్ కి సీటు కేటాయిస్తారు. అలా కాకుండా వీరంతా మొత్తం సభను పరచుకుంటే అంతా ముందు వరసలోకి వస్తే జగన్ కి ఎన్నో వరసలో సీటు కేటాయించాలి అన్నది స్పీకర్ ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది.

గత అసెంబ్లీ తీరు చూస్తే మొత్తానికి మొత్తం అసెంబ్లీ అంతా వైసీపీ ఉంటూ వచ్చింది. టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. అందులో కూడా నలుగురు వైసీపీ వైపు వచ్చేశారు. అలా 19 మందితో టీడీపీ ఉంది. రెండు సీట్లు లాగేస్తామని టీడీపీకి విపక్ష హోదా లేకుండా చేస్తామని కూడా వైసీపీ నేతలు పలు మార్లు అంటూ వచ్చారు.

కానీ టీడీపీ తన బలాన్ని అలాగే గట్టిగా నిలబెట్టుకుంది. అంతే కాదు 2023 మార్చిలో జరిగిన అసెంబ్లీ ద్వారా ఎమ్మెల్సీని ఎన్నుకునే ఎన్నికల్లో వైసీపీ నుంచి నలుగురిని తన వైపునకు తిప్పుకుని ఏకంగా ఒక ఎమ్మెల్సీని సాధించింది. అలా రాజకీయంగా చాకచక్యంతో టీడీపీ వ్యవహరించింది.

అంతే కాదు టీడీపీ తరఫున గెలిచిన వారు అంతా సీనియర్లు కావడంతో వారంతా సభలో తన సంఖ్య తక్కువగా ఉన్నా కూడా 151 సీట్లు ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేసేవారు. అయితే ఈసారి వైసీపీకి ఆ చాన్స్ అన్నది లేదు. గెలిచింది 11 మంది. వారిలో చాలా మంది కొత్త వారు ఉన్నారు. నోరున్న వారు లేకపోవడం ఒక లోటు.

దాంతో జగన్ పక్షాన ఎవరు గట్టినా నిలిచి మాట్లాడుతారు అన్నది కూడా చర్చగా వస్తోంది. ఏది ఏమైనా ఈసారి అసెంబ్లీకి జగన్ వస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. ఎందుకంటే మొత్తం అసెంబ్లీ అంతా అధికార పక్షం అయినపుడు వెళ్ళి అవమానం పడడం ఎందుకు అన్న ఆలోచనతో జగన్ ఉంటే మాత్రం ఆయన రాకపోవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News