ఈవీఎంలపై డౌట్లు.. ఈసీకి కపిల్ సిబల్ అల్టిమేటం!

దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయటమే కాదు.. ఈవీఎంలపై కొత్త సందేహాల్ని తెర మీదకు తీసుకొచ్చింది.

Update: 2024-10-14 08:30 GMT

ఎన్నికల్లో గెలిస్తే ఒకలా.. ఓడితే మరోలా వ్యవహరించే రాజకీయ పార్టీలు.. ఓడిన ప్రతిసారీ ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేయటం.. దానికి సంబంధించిన ఒకట్రెండు అంశాల్ని హైలెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతానికి భిన్నంగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించిన బీజేపీపై పలు సందేహాలు వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని పలు సర్వే సంస్థలన్ని తేల్చి చెప్పినా.. తుది ఫలితం మాత్రం అందుకు భిన్నంగా బీజేపీ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయటమే కాదు.. ఈవీఎంలపై కొత్త సందేహాల్ని తెర మీదకు తీసుకొచ్చింది. ఈసారి ఈవీఎంలపై కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ ఏమంటే.. ఈవీఎంల బ్యాటరీలు 80 శాతం కంటే తక్కువ ఛార్జింగ్ ఉన్న చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు అధిక్యత ప్రదర్శిస్తే.. 99 శాతం చార్జింగ్ ఉన్న ఈవీఎంలలో బీజేపీ అనుకూల ఫలితాలు వచ్చాయన్నది కాంగ్రెస్ ఆరోపణగా తెలిసిందే.

ఈ సందేహాలపై తమకు సమాధానం కావాలని కాంగ్రెస్ కోరుతోంది. తాజాగా ఈ అంశంపై క్లారిటీ కోసం సీన్లోకి వచ్చారు సీనియర్ కాంగ్రెస్ నేత.. ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్. ఈవీఎంలపై తమకున్న సందేహాల్ని కేంద్ర ఎన్నికల సంఘం నివ్రతి చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈవీఎంల దుర్వినియోగం జరుగుతోందనే తాను భావిస్తున్నట్లుగా పేరకొన్న కపిల్ సిబల్.. అది ఏమేరకు అన్న విషయాన్ని తాను చెప్పలేనని చెప్పారు. ఈవీఎంల వాడకాన్ని తాను మొదట్నించి వ్యతిరేకిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

పారదర్శకత లేనిది ఏదైనా.. దానికి తాను వ్యతిరేకంగా పేర్కొన్న కపిల్ సిబల్.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలలో తేడాలపై తమ పార్టీ లేవనెత్తిన సందేహాలను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు సిబల్. ఇప్పటికే తమకున్న సందేహాలపై ఈసీకి సమాచారాన్ని అందించామని.. వాటిని తీర్చాల్సిన బాధ్యత ఈసీపై ఉన్నట్లు డిమాండ్ చేశారు. మరి.. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఏ మేరకు స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News