ఆఖరి అస్త్రం ప్రయోగించిన ముత్తిరెడ్డి

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి టికెట్ ఆశిస్తున్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చివరి అస్త్రం ప్రయోగించారనే చెప్పాలి.

Update: 2023-08-20 12:32 GMT

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి టికెట్ ఆశిస్తున్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చివరి అస్త్రం ప్రయోగించారనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో జనగామ నుంచి తనను కాకుండా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డిని నిలబెడతారనే సమాచారం నేపథ్యంలో ముత్తిరెడ్డి టికెట్ కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే విలేకర్ల సమావేశం పెట్టి టికెట్ కోసం కన్నీళ్లు పెట్టుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి కుట్రలు, కుతంత్రాలు చేస్తూ తనకు టికెట్ రాకుండా చేస్తున్నారని ముత్తిరెడ్డి ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల ముత్తిరెడ్డి కబ్జా చేసిన భూమిని తిరిగి మున్సిపాలిటికీ అప్పగిస్తున్నట్లు ఆయన కుమార్తె ప్రకటించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కానీ తన బిడ్డను పల్లా రాజేశ్వర్రెడ్డి ఉసిగొల్పి తనను దెబ్బ కొట్టేందుకు పన్నాగం పన్నారని ముత్తిరెడ్డి ఆరోపించారు. నియోజకవర్గం కోసం కష్టపడుతున్న తనకే మరోసారి టికెట్ ఇవ్వాలని కన్నీటి పర్యంతమయ్యారు. ఓ బీఆర్ఎస్ మహిళా నేతను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. టికెట్ ఇవ్వాలంటూ కేసీఆర్, కేటీఆర్లను చేతులెత్తి వేడుకున్నారు. సానుభూతి పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ముత్తిరెడ్డికి కాకుండా పల్లాకు టికెట్ ఇస్తే పార్టీ కోసం పనిచేయమని జనగామ బీఆర్ఎస్లోని కొంతమంది కార్యకర్తలు స్పష్టం చేశారు. అంతే కాకుండా ముత్తిరెడ్డికి మద్దతుగా జనగామ ఆర్టీసీ చౌరస్తాలో రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. మరి కేసీఆర్ ముత్తిరెడ్డి పట్ల దయ తలుస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.

Tags:    

Similar News