అత్త చెవి కొరికేసిన కోడలు.. 'అమరావతి' ప్రాంతంలో షాకింగ్ ఘటన

స్థానికుల సమాచారంతో కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-10-09 06:08 GMT

అత్తా కోడళ్ల మధ్య గొడవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. గతంతో పోలిస్తే ఈ గొడవల తీవ్రతలో మాత్రం చాలానే తేడా వచ్చేసింది. అత్త డామినేషన్ ఇప్పటికి అంతో ఇంతో ఉన్నప్పటికీ.. గతంలో మాదిరి పరిస్థితులు మాత్రం లేవనే చెప్పాలి. ఇలాంటివేళలోనూ.. అత్త - కోడలు మధ్య గొడవ తీవ్ర రూపం దాల్చటమే కాదు.. అనూహ్య పరిణామానికి కారణమైంది. స్థానికుల సమాచారంతో కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో భాగమైన తుళ్లూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. శేషగిరి.. పావనిలకు పెళ్లై.. ఇద్దరు పిల్లలు. అయితే.. కొన్ని రోజులుగా కోడలు పావనికి.. అత్త నాగమణికి మధ్య మాటలు సరిగా లేవు. కుటుంబ కలహాల కారణంగా వారిద్దరి మధ్య వివాదం నడుస్తోంది. అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. తర్వాత సర్దుకుంటూ ఉంటాయి.

ఇదిలా ఉంటే.. ఆదివారం రాత్రి వేళ వారిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. మాటా.. మాటా పెరగటం వాతావరణం వేడెక్కిపోయింది. గొడవలో భాగంగా అత్త అన్న మాటలకు ఆగ్రహానికి గురైన కోడలు.. ఒక్కసారిగా అత్త చెవిని కొరికేసింది. అదెంత బలంగా అంటే.. చెవి మొత్తం భాగం ఊడి వచ్చేలా. దీంతో.. షాక్ తిన్న అత్త.. నొప్పితో విలవిలలాడింది. దీంతో అప్పటివరకు గొడవ పడిన కోడలు బెదిరిపోయింది.

కుటుంబ సభ్యులు నాగమణిని తీసుకొని తుళ్లూరు పీహెచ్ సీకి.. అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే.. అప్పటికే ఆలస్యమైందని.. చెవిని అతికించటం కష్టమని వైద్యులు తెలిపారు. దీంతో.. కుటుంబ సభ్యులకు ఏం చేయాలో తోచని పరిస్థితి. మరోవైపు సదరు కుటుంబ సభ్యుల నుంచి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు రాకపోవటంతో కేసు నమోదు చేయలేదు. బాధితుల నుంచి ఫిర్యాదు వస్తే.. తాము చర్యలు తీసుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు.

Tags:    

Similar News