ఆ వార్తలు నన్ను ఎంతో కలచివేశాయి!

ఈ నేపథ్యంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు.

Update: 2024-09-21 07:14 GMT

తిరుమల లడ్డూలో జంతువుల నూనెలు కలిశాయనే ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్‌ అట్టుడుకుతోంది. దేశవ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులు ఈ విషయంపై మండిపడుతున్నారు. స్వామి పట్ల అపచారానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

మరోవైపు ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం నివేదిక కోరింది. గత ప్రభుత్వ హయాంలో రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో క్వాలిటీ లేని నెయ్యిని లడ్డూ తయారీకి వినియోగించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇది టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్ర విమర్శలకు దారితీసింది.

ఈ నేపథ్యంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ఈ మేరకు సోషల్‌ మీడియా మాధ్యమం ఎక్స్‌ లో ఆయన పోస్టు చేశారు. వేంకటేశ్వర స్వామి ప్రసాదం తయారీ విషయంలో వస్తున్న వార్తలు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. 

‘‘తిరుమల శ్రీవారి ప్రసాదముల తయారీ విషయంలో వస్తున్న వార్తలు నన్ను ఎంతగానో కలచివేశాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈ విషయం గురించి ఫోన్లో మాట్లాడాను’’ అని వెంకయ్య నాయుడు తన పోస్టులో తెలిపారు. 

‘‘తిరుమల శ్రీవారు కోట్లాది భక్తుల ఇలవేల్పు. ఆ స్వామి ప్రసాదాన్ని ప్రతి భక్తుడు పరమ పవిత్రంగా స్వీకరించటం మాత్రమే కాదు, వారి ఆత్మీయులకు కూడా శ్రీవారి ఆశీస్సులు ఈ ప్రసాదం ద్వారా లభించాలని, పంచటం మన పెద్దల నుంచి ఆచారంగా వస్తోంది’’ అని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు.

‘‘ఇంతటి ఆధ్యాత్మిక వైశిష్ట్యం వున్న తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో నాణ్యతతో పాటు పవిత్రత కూడా మరింత కీలకం. అలాంటి పవిత్రతకు భంగం కలిగించే చిన్నపాటి దోషమైన క్షమార్హం కాదు’’ అని వెంకయ్య నాయుడు తన పోస్టులో పేర్కొన్నారు.

 ఈ నేపథ్యంలో నిజా నిజాలను నిగ్గు తేల్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వెంకయ్య నాయుడు డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ఆయనను కోరారు. ఇందుకు చంద్రబాబు అంగీకరించారని వెంకయ్య నాయుడు తన పోస్టులో తెలిపారు. 

Tags:    

Similar News