మ‌రో 'స్వాతి'.. కాక‌పోతే క‌ర్నూలు జిల్లాలో..!

Update: 2017-12-16 04:51 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన నాగ‌ర్ క‌ర్నూలు స్వాతి ఉదంతం తెలిసిందే. ఎవ‌డు సినిమాను ప్రేర‌ణ‌గా తీసుకొని భ‌ర్త‌ను చంపేసి.. ప్రియుడ్ని భ‌ర్త స్థానంలోకి తీసుకొచ్చేందుకు భారీ స్కెచ్ వేసిన వైనం రేపిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. ఈ ఉదంతం అంత‌ర్జాతీయ మీడియా సైతం క‌వ‌ర్ చేసింది.

ఈ ఉదంతం లాంటిదే ఈసారి క‌ర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కాకుంటే.. ఈసారి భ‌ర్త‌ను హ‌త్య చేసేందుకు కిరాయి ముఠాల‌కు ఏకంగా సుపారి ఇచ్చిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.  నాగ‌ర్ క‌ర్నూలు  స్వాతి ఉదంతం షాక్ నుంచి తేరుకోక‌ముందే.. బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు మ‌రింత సంచ‌ల‌న‌మైంది.

ఇంత‌కీ.. క‌ర్నూలు స్వాతి ఏం చేసిందన్న‌ది చూస్తే..

క‌ర్నూలు జిల్లా బ్రాహ్మ‌ణ‌ప‌ల్లెకు చెందిన వ‌డ్డె చిన్న మ‌ద్దిలేటి అలియాస్ మ‌ద్ద‌య్య‌కు త‌న అక్క కూతుర్ని (వెంక‌టేశ్వ‌ర‌మ్మ‌) పెళ్లి చేసుకున్నాడు. ఆరేళ్ల క్రితం వీరికి పెళ్లి జ‌రిగింది. ప్ర‌స్తుతం వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ఇదిలా ఉండ‌గా.. వెంక‌టేశ్వ‌ర‌మ్మ‌కు  త‌మ గ్రామానికి చెందిన ముల్ల మ‌హ‌బూబ్ బాషాతో ప‌రిచ‌య‌మైంది.

త‌ర్వాతి కాలంలో అది కాస్తా వివాహేత‌ర సంబంధంగా మారింది. అది కాస్తా బ‌య‌ట‌ప‌డింది. దీంతో.. భార్య భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగేవి.  దీంతో.. వెంక‌టేశ్వ‌ర‌మ్మ‌.. ప్రియుడు బాషాతో క‌లిసి భ‌ర్త‌ను హ‌త్య చేసేందుకు ప్లాన్ చేసింది. ఇందుకు గాను బేతంచ‌ర్ల మండ‌లం బ‌ల‌పాల ప‌ల్లెకు చెందిన మ‌నోహ‌ర్‌ తో రూ.ల‌క్ష‌కు హ‌త్య ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా తొలుత రూ.80వేలు ఇచ్చారు.  

ఒప్పందంలో భాగంగా మ‌ద్ద‌య్య‌కు నిత్యం మ‌ద్యం తాగించేవాడు మ‌నోహ‌ర్‌. అలా క్లోజ్ అయ్యాక‌.. ఈ నెల 4న రాత్రి మ‌ద్ద‌య్య‌ను పూడిచెర్ల‌కు తీసుకెళ్లి మ‌ద్యం తాగించాడు. మ‌త్తులో ఉన్న మ‌ద్ద‌య్య‌ను బ‌ల‌పాల‌ప‌ల్లెకు చెందిన మ‌ల్లికార్జున్ సాయంతో ముఖం మీద బండ‌రాయితో బ‌లంగా మోది హ‌త్య చేశారు. అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసిన పోలీసుల విచార‌ణ‌లో వీరి వ్య‌వ‌హారం బ‌య‌ట‌కురావ‌టం.. వెంక‌టేశ్వ‌ర‌మ్మ‌.. బాషాల‌ను  త‌మ‌దైన శైలిలో విచారించ‌గా.. డ‌బ్బిచ్చి  చంప‌మ‌ని చెప్పిన వైనాన్ని వెల్ల‌డించారు. ప్రియుడి మోజులో ప‌డి క‌ట్టుకున్న మొగ‌డ్ని చంపేసేందుకు సుపారి ఇచ్చిన వైనం సంచ‌ల‌నంగా మారింది.
Tags:    

Similar News