జేసీ దివాకర్ రెడ్డి అంతలా ట్రై చేసినా.. విషాదం మాత్రం తప్పలేదు

Update: 2022-03-31 04:30 GMT
తాజాగా సీనియర్ రాజకీయనేత జేసీ దివాకర్ రెడ్డి చేసిన ఒక పని అందరి అభినందల్ని అందుకుంటోంది. అయితే.. ఆయన ఎంతలా ప్రయత్నించినా.. ఫలితం మాత్రం దక్కలేదు. ఓపక్క ప్రశంసలు.. మరోపక్క విషాదం.. మొత్తంగా అయ్యో అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే.. తాడిపత్రి నుంచి అనంతపురం వెళుతున్నారు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి.

రహదారి మధ్యలో ఒక ఆటో బోల్తా పడి ఉండటం.. అందులో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారు. ఒక మహిళ మాత్రం అపస్మారక స్థితిలో ఉంది. ఇలాంటి వేళ.. అక్కడ ఒక కారు ఆగటం.. అందులో ఉన్న జేసీ దివాకర్ రెడ్డి.. ఒక ఉదుటున కిందకు దిగి.. తట్టి లేపే ప్రయత్నం చేశారు.

అయినప్పటికి స్పందించకపోవటంతో తన కారులో ఆమెను ఎక్కించి.. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అనంతపురం పెద్దాసుపత్రికి వెళ్లిన ఆయన.. ఆమెను అత్యవసర విభాగానికి తరలించారు.

తన సహాయకుడ్ని ఆసుపత్రి వద్దే ఉంచి.. ఆమెకు అవసరమైన వైద్య సాయాన్ని అందించేలా చూడాలని.. ఎప్పటికప్పుడు ఆమెకు సంబంధించిన ఆరోగ్య స్థితి గతుల గురించి తెలియజేయాలని కోరారు. అయితే.. కొద్ది గంటల వ్యవధిలోనే సదరు మహిళ మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.

తాను ఎంతలా ప్రయత్నించినా.. ఒక నిండు ప్రాణాన్ని కాపాడలేకపోయానన్న వేదనకు జేసీ గురయ్యారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల బారిన పడి.. మరణించిన యువతి బుక్కరాయ సముద్రానికి చెందిన మహిళగా గుర్తించారు.

తన దారిన తాను వెళ్లకుండా రోడ్డు మీద జరిగిన ప్రమాదాన్ని గుర్తించి.. ఆమెకు సాయం అందించిన జేసీ తీరు గురించి తెలిసిన వారంతా ఆయన్ను అభినందిస్తున్నారు. అయితే.. అంత ప్రయత్నం చేసినా.. ప్రాణాలు నిలపలేకపోయామన్న ఆవేదన ఆయన వ్యక్తం చేయటం గమనార్హం.
Tags:    

Similar News