బాబు క‌టీఫ్ చెప్పాడ‌ని పండ‌గ చేసుకున్నారు

Update: 2018-03-17 03:56 GMT
టైం తేడా కొడుతున్న‌ప్పుడు ఒప్పుల కంటే త‌ప్పులే ఎక్కువ‌గా చేస్తుంటారు. తాజాగా ఏపీ బీజేపీ నేత‌ల తీరు ఇదే రీతిలో ఉంది. తామేం చేస్తున్నామ‌న్న విచ‌క్ష‌ణ మ‌రిచి వారు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఆంధ్రోళ్ల‌కు మ‌రింత మంట పుట్టిస్తోంది. ఏపీకి హోదా ఇష్యూలో కానీ.. విభ‌జ‌న హామీల అమ‌లులోనూ మోడీ స‌ర్కారు త‌మ‌ను దారుణంగా మోసం చేసింద‌న్న ఆగ్ర‌హంతో ఆంధ్రా ప్రాంత ప్ర‌జ‌లు ఉన్నారు.

ఈ కార‌ణంతోనే.. ఆచితూచి అడుగులు వేసే చంద్ర‌బాబు.. మోడీ మైండ్ సెట్ తెలిసి కూడా పోరాటానికి సై అన‌ట‌మే కాదు.. ఆయ‌న స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసే ప‌రిస్థితి నెల‌కొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి గురువారం రాత్రి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన టీడీపీ.. శుక్ర‌వారం ఉద‌యానికి త‌న నిర్ణ‌యాన్ని మార్చేసుకుంది.

ఏపీ ప్ర‌జ‌ల్లో ఉన్న యాంటీ మోడీ ఫ్యాక్ట‌ర్ ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న టీడీపీ.. ఆయ‌న ప్ర‌భుత్వానికి తామిస్తున్న మ‌ద్దతుకు క‌టీఫ్ చెప్పేశారు. ఇలాంటి స‌మ‌యంలో బీజేపీ నేత‌లు షాక్ కు గురి కావాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా  సంబ‌రాలు చేసుకోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఎన్డీయే నుంచి టీడీపీ బ‌య‌ట‌కు వెళ్లిపోయిన నేప‌థ్యంలో బీజేపీ శ్రేణులు సంబ‌రాలు చేసుకున్నాయి. రాజ మ‌హేంద్ర‌వ‌రంలో చోటు చేసుకున్న ఈ ప‌రిణామాల‌కు సంబంధించిన ఫోటోలు.. వార్త‌లు ఆంధ్రోళ్ల‌కు మ‌రింత మంట పుట్టేలా మారాయ‌న్న మాట వినిపిస్తోంది. ఎన్డీయేకు బాబు క‌టీఫ్ చెప్ప‌టాన్ని.. క‌మ‌ల‌నాథులు బీజేపీకి ప‌ట్టిన గ్ర‌హ‌ణం వీడింద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీ ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ఏం ఉంద‌న్న విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోని ఏపీ బీజేపీ నేత‌లు బాబు క‌టీఫ్ ను పండ‌గ చేసుకోవ‌టం ఎంత త‌ప్ప‌న్న‌ది ఫ్యూచ‌ర్లో వారికి తెల‌వ‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.


Tags:    

Similar News