ఏపీ హైకోర్టు ఆసక్తికర తీర్పు.. పాదం చదునుగా ఉంటే ఆ ఉద్యోగానికి అనర్హులు

Update: 2022-04-08 03:19 GMT
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆసక్తికర తీర్పునిచ్చింది. ఫ్లాట్ ఫుట్ (చదునైన పాదం) ఉన్న వ్యక్తులు సహాయ మోటార్ వాహన ఇన్ స్పెక్టర్ (ఏఎంవీఐ) గా ఎంపిక అయ్యేందుకు అనర్హులని తేల్చింది. 2018లో 23  ఏవీఎంఐ పోస్టుల భర్తీకి రవాణాశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. కడప జిల్లాకు చెందిన నాగేశ్వరయ్య కూడా ఈ పరీక్ష రాశారు.

మెరిట్ లిస్ట్ లో రెండోస్థానంలో నిలిచారు. తర్వాత మెడికల్ పరీక్షకు హాజరయ్యారు. ఫైనల్ రిజల్డ్ లో తన పేరు లేకపోవడంతో ఆయన ఆశ్చర్యపోయారు. మెరిట్ వచ్చినా ఎంపిక కాకపోవడంతో ఏం జరిగిందని ఆరాతీశారు.

నాగేశ్వరయ్య కుడికాలికి చదునైన పాదం ఉండటమే కారణమని అధికారులు తెలిపారు. వెంటనే ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్లను అనర్హులుగా పేర్కొనడం వివక్ష చూపించడమేనని లాయర్ వాదనలు వినిపించారు. ఉద్యోగ ప్రకటనలను రద్దు చేయాలని కోరారు.

ఇటు రోడ్లు-భవనాలు, ఏపీపీఎస్సీ తరుఫున లాయర్లు తమ వాదనలు వినిపించారు. చదునైన పాదం చట్ట నిర్వచనం ప్రకారం అంగవైకల్యం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్ కు దివ్యాంగుల రిజర్వేషన్ వర్తించదని అభిప్రాయపడింది. రవాణాశాఖలో చేపట్టే పోస్టులకు రిజర్వేషన్ వర్తించకుండా.. దివ్యాంగుల హక్కుల చట్టంలోని సెక్షన్ 34(1) ద్వారా మినహాయింపు ఇచ్చారని కోర్టు గుర్తు చేసింది. ఏఎంవీఐ ఉద్యోగ ప్రకటన నిబంధనలకు విరుద్ధంగా ఉందన్న పిటీషనర్ వాదనను తోసిపుచ్చింది.

చదునైన పాదం కలిగిన వ్యక్తి నడిచేటప్పుడు పరిగెత్తే సమయంలో పట్టు ఉండదని తెలిపింది. ఇది అంగవైకల్యం కానప్పటికీ.. ఏఎంవీఐగా విధుల నిర్వహణకు ఆటంకం ఉంటుందని అభిప్రాయపడింది. ఏఎంవీఐ పోస్టు ఒకచోట స్థిరంగా ఉండి విధులు నిర్వహించేది కాదని కోర్టు వ్యాఖ్యానించింది.

అంతేకాదు.. ఏపీ ట్రాన్స్ పోర్ట్ సబార్డినేట్ సర్వీసు నిబంధన 10(డి)(4) .. అలాగే 2009 ఫిబ్రవరిలో ఇచ్చిన జీవో 71 ప్లాట్ ఫుట్ కలిగిన వారిని ఏఎంవీఐగా నియామకాన్ని నిలువరిస్తుందని తెలిపింది. దీంతో ఈ నోటిఫికేషన్ ను రద్దు చేయాలన్న వాదనను తిరస్కరించి పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
Tags:    

Similar News