ఏపీపీఎస్సీ బోణీ చేసిందోచ్..

Update: 2016-08-18 14:20 GMT
బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి నవ్యాంధ్రలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇంతవరకు ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేసింది లేదు. ఆమధ్య ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడానికి సన్నాహకంగా ఖాళీలు ప్రకటించినా నోటిఫికేషన్లు మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నోటిఫికేషన్ ఇవ్వడంతో నవ్యాంధ్రలో బోణీ చేసినట్లయింది.  రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీపీఎస్సీ తొలి నోటిఫికేష‌న్ ను ఈరోజు విడుద‌ల చేసింది. పంచాయ‌తీ రాజ్ - ఆర్ అండ్‌ బీ స‌హా వివిధ శాఖ‌ల్లో ఇంజనీరింగ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేయడంతో నిరుద్యోగుల్లో హుషారొచ్చింది.

కాగా ముందు చెప్పినట్లే అభ్య‌ర్థుల వ‌యో ప‌రిమితిని కూడా 40 ఏళ్ల‌కు పొడిగించంది ఏపీపీఎస్సీ ఈ నోటిఫికేష‌న్ ద్వారా 740 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయినా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ఇంతకాలం ప్రతిపక్షాలు చేసే విమర్శలను ఆయన ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఈ విషయంలో వైసీపీ తరచూ ఆరోపణలు చేసేది. బాబు వచ్చినా జాబు రాలేదంటూ ఎద్దేవాచేసేది. మరోవైపు రీసెంటుగా తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం కూడా ఏపీలో ఉద్యోగ ప్రకటనలు ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. ఇలాంటి తరుణంలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం బాబుకు ఊరట కలిగించింది.

కాగా ఏపీపీఎస్సీకి చాలాకాలం ఛైర్మన్ లేకపోవడం.. ఛైర్మన్ నియామకం తరువాత సభ్యులు లేకపోవడంతో ప్రకటనల ప్రక్రియలో బాగా జాప్యమైంది. ఆలస్యంగానూ నోటిఫికేషన్లు మొదలవడంతో ఇదే ఊపులో మిగతా నోటిఫికేషన్లూ ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు. అంతేకాదు... నోటిఫికేషన్లు ఇచ్చినా పరీక్షల నిర్వహణ, ఇంటర్వ్యూలు, నియామకాల విషయంలో గతం నుంచీ ఏపీపీఎస్సీపై అపప్రద ఉంది. ఏళ్ల తరబడి జాప్యం చేస్తుందన్న ముద్ర ఉంది. నవ్యాంధ్రలోనైనా ఆ ముద్ర తొలగించుకుని త్వరితగతిన నియామకాలు పూర్తిచేయాలని కోరుతున్నారు.

Tags:    

Similar News