అయ్యన్నకు ఇప్పుడే గుర్తుకొచ్చిందా ?

Update: 2021-04-25 05:30 GMT
తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత దూళిపాళ నరేంద్రను ఏసీబీ అరెస్టు చేసిన తర్వాతే మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుకి ఓ విషయం గుర్తుకొచ్చినట్లుంది. ఏసీబీ, సీఐడీలు స్వతంత్రసంస్ధలని. ముఖ్యమంత్రి చెప్పినట్లు కాకుండా విచక్షణ ఉపయోగంచాలని రెండుసంస్ధల అధిపతులకు అయ్యన్న హితవు చెప్పటమే విచిత్రంగా ఉంది. తిరుపతి ఉపఎన్నికలో దొంగఓట్లు వేసిన వాళ్ళను పోలీసులు అరెస్టులు చేయకుండా వదిలేయటం నిజంగా ధౌర్భాగ్యమంటు మండిపోయారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సీఐడీ, ఏసీబీ స్వతంత్ర సంస్ధలు ఎలాగవుతాయి. అవి రాష్ట్రప్రభుత్వంలో ఓ భాగమే అన్న విషయం మంత్రిగా పనిచేసిన అయ్యన్నపాత్రుడికి అంతమాత్రం తెలీదా ? అధికారంలో ఎవరున్నా పోలీసు వ్యవస్ధను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవటం కొత్తేమీకాదు. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు కూడా ఇలాంటివి చాలానే చేశారు. 2014-19 మధ్యలో వైసీపీ ఎంఎల్ఏలు, నేతలను లక్ష్యంగా చాలామందినే అరెస్టుచేయించారు.

అప్పట్లో పోలీసులు వైసీపీ నేతల విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తున్న విషయం అయ్యన్నకు గుర్తుకురాలేదా ?  ఇక దొంగఓట్ల విషయానికి వస్తే నంద్యాల, తిరుపతి ఉపఎన్నికల విషయంలో టీడీపీ ఎంత ఘోరంగా వ్యవహరించింది, వ్యవస్ధలను మ్యానేజ్ చేసుకుందో అందరికీ గుర్తుంది. అప్పుడు టీడీపీ చేసిన అరాచకంతో పోల్చుకుంటే ఇప్పుడు వైసీపీ చేసింది తక్కువనే చెప్పాలి. దొంగఓట్లు తప్పే అనటంలో సందేహంలేదు. కానీ అయ్యన్న మాత్రం తాము వేసుకుంటే తప్పులేదు, వైసీపీ వేసుకుంటే మాత్రమే తప్పన్నట్లుగా మాట్లాడారు.

సంగం డైరీనీ సహకార వ్యవస్ధనుండి కంపెనీల చట్టంలోకి మార్చటమే దూళిపాళ చేసిన నేరమా ? ఈమాత్రానికే అరెస్టుచేస్తారా ? అంటు నిలదీయటమే ఆశ్చర్యంగా ఉంది. సహకార వ్యవస్ధలో నుండి కంపెనీల చట్టంలోకి మార్చటం తప్పని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. కంపెనీ చట్టంలోకి మార్చుకున్న డైరీలో దూళిపాళ అవినీతి, అక్రమాలకు పాల్పడిన కారణంగానే అరెస్టు చేసినట్లు చెప్పింది. డైరీ ఆధీనంలో ఉండాల్సిన పదెకరాల భూమిని తన తండ్రి వీరయ్య చౌదరి పేరుతో పెట్టుకున్న ట్రస్టుకు అక్రమంగా బదలాంచినట్లు ఏసీబీ ఆరోపిస్తోంది.

ఒక్క భూమనే కాకుండా చాలా విషయాల్లో దూళిపాళ అక్రమలకు పాల్పడినట్లు ఏసీబీ ఆరోపిస్తోంది. నిజంగానే దూళిపాళ అక్రమాలు, అవినీతికి పాల్పడుంటే వాటిని నిరూపించాల్సిన బాధ్యత ఏసీబీ మీదే ఉంది. తమ ఆరోపణలను ఏసీబీ నిరూపించలేకపోతే దూళిపాళ బయటకు వచ్చేస్తారు. వాస్తవాలు ఇలాగుంటే అయ్యన్నమాత్రం నోటికొచ్చినట్లు వక్రీకరించి మాట్లాడేస్తున్నారు. మొత్తానికి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతే ఏసీబీ, సీఐడీలు స్వతంత్రసంస్ధలను గుర్తుకురావటం ఆశ్చర్యంగా ఉంది.
Tags:    

Similar News