టీఆర్ఎస్, ఎంఐఎంకు కాంగ్రెస్ 'బీ' టీంనా?

Update: 2022-06-08 04:43 GMT
హైదరాబాద్ లో బాలిక పై రేప్ జరిగిన వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ కేసులో కొన్ని పార్టీలు ఇన్వాల్వ్ కావడంతో పొలిటికల్ వేడి సంతరించుకుంది. ముఖ్యంగా ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు తీవ్రమైంది. బాలిక రేప్ కు సంబంధించిన వీడియోను బీజేపీ మీడియాకు రిలీజ్ చేయడంపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన పై కేసు నమోదు చేసిన పోలీసులు ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో బీజేపీ నాయకులు సైతం అంతేస్థాయిలో ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ కేసులో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు సంబంధం ఉంటే కాంగ్రెస్ నాయకులు ఎందుకు తొందరపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.  తను ఇంతకుముందు కొన్ని సంవత్సరాలు పనిచేసిన కాంగ్రెస్ పార్టీపైనే డీకే అరుణ విరుచుకుపడడం విశేషం. పాత సాన్నిహిత్యాలన్నీ పక్కనపెట్టి పక్కా బీజేపీ వాదిలా అరుణక్క రెచ్చిపోయారు.

నగరంలో జరిగిన అత్యాచారం ఘటనలో ఓ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని ఆరోపణలు వచ్చాయి.  అయితే ఎమ్మెల్యేకు సంబంధించిన పార్టీకి వ్యతిరేకంగా ఆందోళన చేయాల్సిన కాంగ్రెస్.. వారికి బీ టీంగా వ్యవహరిస్తుందని డీకే అరుణ విమర్శించారు.

బాలికపై అత్యాచార కేసులో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు చెందిన వారే ఉన్నారన్నారు. వారిని తప్పించడానికే కాంగ్రెస్ పనికిమాలిన ఆందోళన చేస్తోందన్నారు. ఈ ఘటనకు సంబంధించిన సాక్ష్యాలను బయటపెట్టిన ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు పెట్టడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. న్యాయంగా పోరాడాల్సిన వారిని భయపెట్టడమే ప్రభుత్వం చేస్తున్న పని అన్నారు.

రాష్ట్రంలో అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, నేరాలను నియంత్రించాల్సిన పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. శాంతి భద్రత అంశంపై పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. గత కొన్ని రోజులుగా హత్యలు, లైంగిక దాడులు విపరీతంగా పెరుగుతున్నాయని, పోలీసులు ఈ విషయంలో కఠినంగా ఉండడం లేదన్నారు. కొందరు రాజకీయ నాయకులకు పోలీసులు కొమ్ము కాస్తూ అమాయకులను వంచిస్తున్నారన్నారు.

ఈ విషయంపై ప్రశ్నిస్తున్న పార్టీలపై పోలీసులు చర్చలు తీసుకోవడం హేయమైన చర్య అని అన్నారు. ఇప్పటికైనా పోలీసులు శాంతి భద్రతల విషయంలో నిర్లక్ష్యాన్ని వీడాలని అన్నారు. పోలీసులు బాధితుల పక్షాన కాకుండా నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఏ పార్టీ తరుపున కాకుండా అమాయకులను రక్షించేలా పోలీసు వ్యవస్థ పనిచేయాలన్నారు.
Tags:    

Similar News