ఈ రాష్ట్రంలో రివ‌ర్స్.. వేరే పార్టీలోకి బీజేపీ ఎమ్మెల్యేలు!

Update: 2022-07-26 05:29 GMT
దేశంలో ప్ర‌తిప‌క్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విప‌క్ష నేత‌ల‌పై సీబీఐ, ఈడీల‌ను ఉసిగొల్పుతూ.. ఆయా పార్టీల్లో చీలిక‌లు తెస్తూ.. ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను బీజేపీ ప‌డ‌గొడుతోంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్, క‌ర్ణాట‌క‌, పాండిచ్చేరి, గోవా త‌దితర రాష్ట్రాల‌ను ఉదాహ‌ర‌ణ‌గా చూపుతున్నారు.

దేశంలో త‌మిళ‌నాడు, కేర‌ళ‌, ఏపీ, తెలంగాణ‌, ఒడిశా, రాజ‌స్థాన్, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, జార్ఖండ్, పంజాబ్, ఢిల్లీ, ప‌శ్చిమ బెంగాల్ మిన‌హాయించి దాదాపు మిగిలిన అన్నిచోట్లా బీజేపీ ప్ర‌భుత్వాలు లేదంటే ఎన్డీయే కూట‌మిలోని పార్టీలే అధికారంలో ఉన్నాయి. ఇలా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ రాజ‌కీయాలు చేస్తూ విప‌క్ష ప్ర‌భుత్వాల‌ను ప‌డేస్తున్న బీజేపీకి జార్ఖండ్ లో మాత్రం షాక్ త‌గ‌ల‌నుంద‌నే వార్త‌లు ఆ పార్టీలో ఆందోళ‌న‌కు దారితీశాయి.

జార్ఖండ్ లో అధికారంలో జార్ఖండ్ ముక్చి మోర్చా అధికారంలో ఉంది. ప్ర‌స్తుతం హేమంత్ సోరెన్ అధ్య‌క్షుడిగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో మొత్తం 81 స్థానాలు ఉన్న జార్ఖండ్‌ అసెంబ్లీలో జేఎంఎం 30, కాంగ్రెస్‌ 16, ఆర్జేడీ 1 స్థానం గెల్చుకుంది. అలాగే బీజేపీ 25 స్థానాలు దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తిమోర్చా, కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

ఈ నేప‌థ్యంలో తాజాగా బీజేపీ నుంచి పదహారు మంది ఎమ్మెల్యేలు తమతో 'టచ్‌'లో ఉన్నారంటూ జార్ఖండ్‌ ముక్తి మోర్చా అనూహ్య ప్రకటన చేసింది. యూపీఏ మిత్రపక్షం అయినప్పటికీ.. జేఎంఎం మొన్న జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకే మద్ధతు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా గిరిజ‌నుడే. అందులోనూ ద్రౌప‌ది ముర్ముకే చెందిన సంతాల్ తెగ‌కు చెందిన వ్య‌క్తి. ఈ నేప‌థ్యంలో ద్రౌప‌ది ముర్ముకు జేఎంఎం మ‌ద్ద‌తు ఇచ్చింది.

ఈ క్ర‌మంలో సుమారు పదహారు మంది బీజేపీ ఎమ్మెల్యేలు జేఎంఎంలో చేరేందుకు రెడీగా ఉన్నారంటూ జేఎంఎం చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. 'బీజేపీ ఆకర్ష్‌.. ఇక్కడ వర్కవుట్‌ అయ్యే ఛాన్స్‌ లేదు. ఎందుకంటే వాళ్లు(16 మంది బీజేపీ ఎమ్మెల్యేలు) తమ పార్టీలో ఇబ్బందికర పరిస్థితుల్లో కొనసాగుతున్నారు. వాళ్లంతా హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు' అని జార్ఖండ్ ముక్తి మోర్చా అధికారిక ప్రతినిధి సుప్రియో భట్టాచార్య ప్రకటించారు. అవసరం అయితే బీజేపీ నుంచి చీలిపోయి.. ఒక గ్రూపుగా ఏర్పడి జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు వాళ్లంతా సిద్ధంగా ఉన్నారని సుప్రియో పేర్కొన‌డం తీవ్ర క‌ల‌కలం సృష్టించింది.

అయితే.. ఇటీవ‌ల‌ ఆ రాష్ట్ర సీఎం హేమంత్‌ సోరెన్‌పై అక్రమ మైనింగ్‌ ఆరోపణలపై దర్యాప్తు సంస్థల దృష్టి పడింది. మరోవైపు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సైతం బీజేపీ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో జేఎంఎం.. బీజేపీ నుంచే తమవైపు ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ జేఎంఎం ప్రకటించడం కొసమెరుపు.

ఇదిలా ఉంటే జేఎంఎం ప్రకటనపై బీజేపీ వెటకారంగా స్పందించింది. అవినీతిలో కూరుకుపోయిన జేఎంఎం.. ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని పేర్కొంది. రాష్ట్రపతి ఎన్నికల్లో జేఎంఎం ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి ఇచ్చారో అందరికీ తెలుసని, ప్రజావ్యతిరేకత నేపథ్యంలో త్వరలో జేఎంఎంతో పాటు కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి వలసలు తప్పవని బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్‌ సహదేవ్‌ ప్రకటించారు. జార్ఖండ్ లో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌టం ఖాయ‌మని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.
Tags:    

Similar News