కేసినో వ్యవహారం.. ఈడీ విచారణకు ఆ వైసీపీ నేత హాజరు!

Update: 2022-11-17 10:30 GMT
విదేశాల్లో కేసినోల ముసుగులో భారీ ఎత్తున నల్లధనాన్ని తరలిస్తున్నారని నాలుగు నెలల క్రితం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తెలంగాణలో దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. కేసినోల నిర్వాహకులు చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డిల ఇళ్లు, కార్యాలయాల్లో భారీ ఎత్తున సోదాలు నిర్వహించింది.

ప్రత్యేక విమానాల్లో శ్రీలంక, నేపాల్, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌ తదితర దేశాలకు తీసుకెళ్లి అక్కడ కేసినో ఆడించిన వ్యవహారంలో ఇప్పటికే కేసినోల నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌పై ఈడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వారి వద్ద అప్పట్లో లభించిన డైరీల్లో రెండు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేతలు, ఎమ్మెల్యేలు ఉన్నట్టు వెల్లడైంది.

ఈ నేపథ్యంలో విదేశాల్లో కేసీనోల నిర్వహణ, భారీ ఎత్తున నగదు చేతులు మారిన వ్యవహారం, మనీలాండరింగ్‌ తదితరాలకు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దూకుడు పెంచింది.

తాజాగా ఈ వ్యవహారంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డిని ఈడీ విచారించింది. ఈ మేరకు ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న గుర్నాథ్‌రెడ్డి హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో గుర్నాథ్‌రెడ్డిని అనేక కోణాల్లో ఈడీ అధికారులు విచారించి సమాధానానాలు రాబట్టారు.

2009లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా అనంతపురం అర్బన్‌ నుంచి గెలుపొందిన గుర్నాథ్‌రెడ్డి తర్వాత 2011లో వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేసిన వైసీపీలో చేరారు. 2012లో అనంతపురం అర్బన్‌ నుంచే వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ప్రభాకర్‌ చౌదరి చేతిలో ఓడిపోయారు.

కాగా ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా టీఆర్‌ఎస్‌ మంత్రి తల­సాని శ్రీనివాస్‌యాదవ్‌ సోద­రు­లు మహేశ్, ధర్మేందర్‌లకు ఉన్న సంబంధాలపై ఈడీ నవంబర్‌ 16న ప్రశ్నించింది. చీకోటి ప్రవీణ్‌ నిర్వహించిన ఈ కేసీనోలకు తలసాని సోదరులు  హాజరయ్యారన్న సమాచారం ఈడీకి ఉంది. దీంతో ఈడీ అధికారులు వారి నుంచి పలు వివరాలు తెలుసుకున్నారు.

టీఆర్‌ఎస్‌ ముఖ్య నేత, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ,  మెదక్‌ డీసీసీబీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డికి తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో అధికార టీఆర్‌ఎస్‌కు షాక్‌ తగిలింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News