బాబుకు తెలంగాణా మీద ఆశలు పోలేదా... ?

Update: 2022-04-16 15:48 GMT
చంద్రబాబు చూపు చాన్నాళ్ల తరువాత తెలంగాణా మీద పడింది.  నిజానికి  చాన్నాళ్ళు కాదు, చాలా ఏళ్ళు అని కూడా అనాలేమో. ఎందుకంటే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో జట్టు కట్టి ఘోరంగా ఓడాక బాబు ఫుల్ సైలెంట్ అయ్యారు. అప్పటికి అరకొరగా  మిగిలిన వారంతా ఇపుడు వేరే పార్టీలలో సర్దుకున్నారు. ఈ నేపధ్యంలో మరో ఏడాది గిర్రున తిరిగితే తెలంగాణా ఎన్నికలు వచ్చేస్తాయి. మరి చంద్రబాబు ఆ వైపుగా ఏమైనా సీరియస్ గా లుక్కేస్తున్నారా అన్న డౌట్లు అందరిలోనూ వస్తున్నాయి.

నిజంగా కేసీయార్ అక్కడ ఉన్నారు. ఆయన 2014లో తెలంగాణా వాదంతో గెలిచారు, 2018లో చంద్రబాబు ప్లస్ కాంగ్రెస్ కేరాఫ్ ఆంధ్రా పెత్తనం అంటూ బిగ్ సౌండ్ చేసి మరీ రెండవసారి గెలుపు గుర్రం ఎక్కారు. ఈసారి అలాంటి చాన్స్ ఏదీ లేదనుకుని మోడీని, బీజేపీని గట్టిగా విమర్శిస్తూ తన రాజకీయాన్ని పండించుకోవాలనుకుంటున్నారు. తెలంగాణాలో పెద్దగా లేని శత్రువుతో అను నిత్యం యుద్ధం చేయడం ద్వారా కేసీయార్ తన వంతుగా తాను ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు.

అయితే ఈ ఎత్తులు ఎంతవరకూ పండుతాయన్నది పెద్ద డౌట్. ఎందుకంటే ఎక్కడో ఢిల్లీలోని బీజేపీ మోడీకి తెలంగాణాలో ముడి పెట్టి కుస్తీ మే సవాల్ అని కేసీయార్ తొడ కొట్టినా ఓట్లు రాలుతాయా అంటే చెప్పలేరు. సరిగ్గా ఈ టైమ్ లో కాంగ్రెస్ ఎంట్రీ ఇస్తోంది. రాహుల్ గాంధీ ద్వారా తెలంగాణాలో ఎక్కడికక్కడ సభలూ సమావేశాలూ నిర్వహిస్తూ బలపడాలని హస్తం పార్టీ చూస్తోంది.

నిజానికి టీయారెస్ ని ఈ రోజుకీ ఢీ కొట్టాలన్నా నిలువరించాలన్నా కాంగ్రెస్ మాత్రమే అక్కడ ఆల్టర్నేషన్ గా ఉంది. బీజేపీకి కేంద్రం కళలు. మోడీ ప్రభలే తప్ప మొత్తం 119 సీట్లలో బలం లేదు అన్నది వాస్తవం. అయితే గతం కంటే కొంత పెరిగితే పెరగవచ్చు. ఇక ఇంకో వైపు చూస్తే తెలంగాణాలో వైఎస్ షర్మిల పాదయాత్రలు చేస్తున్నారు. ఆమె పార్టీ వైఎస్సార్టీపీ ఉంది.బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ రాష్ట్ర స‌మ‌న్వ‌య‌క‌ర్త ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సైతం పాదయాత్ర చేస్తూంటే ఆప్ కూడా రెడీ అంటోంది.

అయినా సరే ప్రధానంగా రేసులో ఉండేవి మూడు పార్టీలే. టీయారెస్ ని తప్పిస్తే బీజేపీ కాంగ్రెస్. మరి ఈ రెండు పార్టీలలో దేనికి కన్ను కొట్టాలని చంద్రబాబు హుషార్ చేస్తున్నారు అన్నదే ఎవరికీ అర్ధం కాలేదు. పార్టీని, ఆఫీస్ ని పట్టుకుని ఏళ్ళకు ఏళ్ళు గడిపేసిన  ఎల్ రమణ కూడా ఆఖరుకు కారు ఎక్కేసిన వేళ టీడీపీకి తెలంగాణాలో బలం ఎక్కడ ఉంది అన్నది పెద్ద ప్రశ్న.

అయితే చంద్రబాబు మాత్రం టీయారెస్ ని నిలువరిస్తే మళ్ళీ ఎంతో కొంత టీడీపీ పుంజుకుంటుంది అన్న లాజిక్ తో క్యాడర్ కి ధైర్యం నూరి పోస్తున్నారు. చంద్రబాబు అపుడే 27 నియోజకవర్గాలని ఇంచార్జిలను ప్రకటించారు. అంటే నేను సీన్ లో ఉన్నానని చెప్పడమే అది. ఇక పొత్తుల ద్వారానే ఎత్తులు వేయాలన్నది బాబు ఆలోచన.

గతసారి కాంగ్రెస్ తో కలిశారు. ఈసారి కూడా కాంగ్రెస్ తో కలుస్తారా ఏంటి అన్న చర్చ ఉంది. ఇపుడు తెలంగాణా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒకనాడు బాబుకు నమ్మిన బంటు. ఆయన ఎంత చెబితే అంత. అలాంటి రేవంత్ బాబు నీడ నుంచి బయటకు వచ్చి తన మానాన తాను ఎదిగేందుకు చూస్తున్నారు. కాంగ్రెస్ లో ఆయన ఎన్నో రకాలుగా కృషి చేసి పీసీసీ చీఫ్ పట్టేశారు.

ఈ వెలుగులు ఇలా ఉండగానే పార్టీని అధికారంలోకి తెస్తే జీవితంలో ఒకసారి అయినా సీఎం అవకపోతామా అన్నది రేవంత్ ఆశ, ఆలోచన. ఇపుడు బాబు కాస్తా సైకిల్ ఎక్కేసి తెలంగాణా పొలిటికల్ గ్రౌండ్స్ లో చక్కర్లు కొడితే ముందుగా గుండెల్లో గంటలు కొట్టేది రేవంత్ కే. ఇప్పటికే కాంగ్రెస్ లో రేవంత్ ని టీడీపీ నుంచి వచ్చిన నేత అని బాబు దోస్త్ అని ప్రచారం చేసేవారు ఉన్నారు.

దాంతో తన అవకాశాలు ఎక్కడ జారిపోతాయో అన్న కంగారు రేవంత్ కి ఉండడంలో పొరపాటు లేదు. ఇక బాబు వైఖరి చూస్తే కాంగ్రెస్ తో చేతులు కలిపి పోటీకి దిగాలని ఉంది అంటున్నారు. అదే కనుక జరిగితే ఈ ప్లాన్ అంతా వేసుకుని ముందే రేవంత్ ని కాంగ్రెస్ లోకి పంపారు అన్న ఖద్దరు నేతల ప్రచారం నిజం అయిపోతుంది. అలాగే టీయారెస్ కూడా ఊరుకుంటుందా.

ఎంచక్కా 2018 నాటి స్ట్రాటజీనే మళ్లీ రిపీట్ చేస్తుంది. ఆంధ్రా బాబు, తెలంగాణా రేవంతూ అంటూ జనాల్లోకి స్లోగన్ బలంగా తీసుకెళ్తే కాంగ్రెస్ గెలుపు ఆశలు గల్లంతు అవుతాయి. అంత వరకూ కధ సాగకుండా కాంగ్రెస్ సీనియర్లు పీసీసీ కుర్చీకి ఎసరు పెట్టేసినా రేవంత్ ప్లాన్ మొత్తం చిత్తు అవుతుంది.

మొత్తానికి బాబు దూకుడు ని చూసి జడుసుకుంటోంది రేవంత్ మాత్రమే అంటున్నారు. గురువు గారూ ఈ వైపు చూడమాకండి అని రేవంత్ అనుకున్నా ఆశ్చర్యం లేదు. కానీ బాబు పధకాలకు చింతకాయలైనా రాలాలి కదా. మధ్యలో రేవంతుల బెదుర్లూ బెంగలతో ఆయనకు పనేంటి. సో బాబు సైకిల్ జోరుగా తొక్కేస్తున్నారిపుడు. చూడాలి మరి  ఆ సైకిలు ఏ పార్టీ ఆఫీసు ముందు బ్రేకులేస్తుందో.
Tags:    

Similar News