కేంద్రంపై బాబు కొత్త అసంతృప్తి

Update: 2016-08-14 06:10 GMT
ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా కేంద్రంగా ఏపీ స‌ర్కారు-ఎన్డీఏ ప్ర‌భుత్వం మ‌ధ్య గ్యాప్ పెరుగుతోందా? ఏపీకి ఇచ్చిన హామీల విష‌యంలో కేంద్రం అనుస‌రిస్తున్న వైఖ‌రిని ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌హించ‌డం లేదా అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ప్ర‌స్తుతం ఢిల్లీ కేంద్రంగా వెలువ‌డుతున్న వార్త‌ల ప్ర‌కారం ఏపీకి ప్ర‌త్యేక హోదా బ‌దులుగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్‌ ని ఇస్తామంటూ కేంద్రం ప్రకటించగా మరోవైపు ఆ ప్యాకేజీపై ప్రత్యేక కమిటీ కసరత్తు చేస్తున్నది. అయితే ఈ ప్యాకేజి అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం.

ప్ర‌త్యేక హోదాకు బదులుగా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడేలా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ రూపంలో అదనపు ఆర్ధిక సహాయాన్ని అందజేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది చాలా తక్కువగా ఉందంటూ చంద్రబాబు నాయుడు కేంద్రానికి స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది. కేంద్రం ఇవ్వజూపుతున్న అదనపు సహాయం మొత్తంతో రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం ఏమి ఉండదంటూ ఏపీ విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నిటిని ఎన్డీయే ప్రభుత్వం తూచతప్పకుండా అమలు చేయాల్సిందేనని సీఎం చంద్రబాబు పట్టుబడుతున్నట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా విభజన తరువాత ఏర్పడిన రెవెన్యూలోటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరాలు - కాగ్‌ నివేదికలోని వివరాలతో విభేదిస్తున్న కేంద్ర ఆర్ధికశాఖ రాష్ట్రానికి అందించాల్సిన నిధులలో రూ.7 వేల కోట్లకు పైగా కోత విధించడాన్ని సీఎం చంద్రబాబు తీవ్రంగా ఆక్షేపిస్తున్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. ప్యాకేజీ పేరుతో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ఇవ్వజూపుతున్న అదనపు సహాయం రాష్ట్రం ఆశిస్తున్న స్థాయిలో లేదంటూ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ ప్యాకేజి రూపురేఖలను ఖరారు చేసే ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది.

14వ ఆర్ధిక సంఘం సిఫారసుల అమలు కారణంగా ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి కేంద్ర ప్రయోజిత పధకాల నిధుల్లో 60 శాతానికి బదులు 90 శాతాన్ని కేంద్రం భరించడం మినహా అదనంగా రాష్ట్రానికి మరే ఇతర ప్రయోజనం చేకూరదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంద‌ని ఇందుకే బ్రేక్ ప‌డింద‌ని స‌మాచారం. అందుకు కేంద్ర ఆర్దిక మంత్రి మరో రూపంలో రాష్ట్రానికి అదనపు నిధులు సమకూరుస్తామని ప్రతిపాదించారు. ఇదిలాఉండ‌గా తొలి ఏడాది లో 13 వేల కోట్లకు పైగా రెవెన్యూ లోటు ఏర్పడినట్లు కేంద్రానికి నివేదించినా అందులో రూ.7వేల కోట్లను తాము అంగీకరించేది లేదని కేంద్రం తేల్చిచెప్పడంతో ఈ పద్దు క్రింద మరో 4 వేల కోట్లు మాత్రమే కేంద్రం విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని కూడా 3 దశల్లో ఇస్తారు. దాంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని చంద్రబాబు అంటున్నారు. ఒక్కసారి ప్యాకేజీకి ఒప్పుకుంటే ఇలాగే కోతలు పెడతారంటూ సీఎం చంద్రబాబు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News