అమెరికా కంప్యూటర్లపై చైనా కీలక నిర్ణయం

Update: 2022-05-11 06:28 GMT
చైనాలో వాడుతున్న అమెరికా కంప్యూటర్లపై డ్రాగన్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రోజురోజుకు బలహీనమవుతున్న అమెరికా-చైనా సంబంధాల నేపథ్యంలో చైనా ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే చైనాలో వాడుతున్న అమెరికా తయారీ కంప్యూటర్లన్నింటినీ దశలవారీగా మార్చేయాలని. ప్రస్తుతం చైనాలో అమెరికా తయారీ కంపెనీలకు చెందిన కంప్యూటర్లు సుమారు 5 కోట్లున్నాయి.

దశలవారీగా ఈ 5 కోట్ల కంప్యూటర్లను మార్చేయాలని డ్రాగన్ నిర్ణయించింది. ప్రపంచాధిపత్యం కోసం ఒకవైపు అమెరికా మరోవైపు చైనా పోటీపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఏ చిన్న అవకాశం వచ్చినా రెండు దేశాలు చెరోవైపు మోహరిస్తున్నాయి. రేపేదైనా అనుకోని పరిస్ధితులు ఎదురైతే చైనాపై అమెరికా ఆంక్షలు విధించినపుడు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సొస్తుందని జిన్ పింగ్ ప్రభుత్వంలో  ఆందోళన మొదలైంది.

ప్రభుత్వ ఆఫీసుల్లోను, ప్రభుత్వ ఏజెన్సీల్లోను ఇపుడు వాడుతున్న కోట్లాది కంప్యూటర్ల ద్వారా అమెరికా చైనాను ఇబ్బందులు పెట్టే అవకాశాలున్నాయని డ్రాగన్ అనుమానిస్తోంది. కీలకమైన విభాగాల్లో విదేశీ టెక్నాలజీ వాడకాన్ని నిషేధించాలని నిర్ణయించింది.

రెండేళ్ళలోపు స్థానికంగా తయారు చేసిన డిజైన్ల కంప్యూటర్లను ఉపయోగించాలని కూడా డిసైడ్ చేసింది. చైనాలో అమెరికా తయారీ కంప్యూటర్లు హెచ్పీ, డెల్ లాంటి కంప్యూటర్లను ప్రభుత్వ ఆఫీసులతో పాటు మామూలు జనాలు కూడా విపరీతంగా వాడుతున్నారు.

రెండేళ్ల తర్వాత నుండి ఈ కంప్యూటర్లు చైనాలో మాయమైపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే చైనా తయారీ కంప్యూటర్ లెనోవా వాటి స్ధానాన్ని ఆక్రమిస్తుంది కాబట్టే. లెనోవా కంప్యూటర్లకు కూడా ప్రపంచంలో బాగానే డిమాండ్ ఉంది. డ్రాగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో లెనోవా కంప్యూటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోవటం ఖాయం.

అలాగే కంప్యూటర్లలో వాడే చిప్ ల కోసం కూడా అమెరికా మీద ఆధారపడకూడదని డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగా దేశీయంగానే చిప్ లను తయారుచేయించేందుకు డ్రాగన్ 16 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. మరోవైపు స్ధానికంగానే హార్డ్ డిస్క్ లను తయారుచేయటానికి లెనోవా, హువావే, ఇన్ స్టర్ కంపెనీలు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నాయి.
Tags:    

Similar News