కాంగ్రెస్ నేత.. కాన్ఫిడెన్సా - ఓవర్ కాన్పిడెన్సా!

Update: 2019-05-06 07:41 GMT
రాజస్తాన్ లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలే సాధించింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ పొడిచింది ఏమీ లేదు, ప్రతి ఐదేళ్లకూ ఒక పార్టీని ఓడించడం, మరో పార్టీని గెలిపించడం రాజస్తానీల స్వభావం అనేది విశ్లేషకులు చెప్పేమాట. పలు ధఫాలుగా ఆ ఎడారి రాష్ట్రంలో అలాంటి ప్రజా తీర్పే వస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గిందని పరిశీలకులు అంటున్నారు.

ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల్లోనూ రాజస్తాన్ లో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపుతుందని కూడా విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గింది కాబట్టి లోక్ సభ ఎన్నికల్లోనూ అక్కడ కాంగ్రెస్ కు అనుకూలత ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఆ అనుకూలత ఎంతో కొంత ఉంటుందని.. కనీసం సగం ఎంపీ సీట్ల కన్నా ఎక్కువ సీట్లను కాంగ్రెస్ సొంతం చేసుకోవచ్చని వారు అంచనా వేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం అంతటితో ఆగడం లేదు. తాము సంచలన విజయం సాధిస్తామన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు.

రాజస్తాన్ లో అయితే పాతిక ఎంపీ సీట్లకు గానూ అన్నింటినీ నెగ్గేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ నేత సచిన్ పైలట్ అంటున్నారు. తమ పార్టీ తమ రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. గెలుస్తామని ధీమాగా చెప్పడం వరకూ ఓకే కానీ, మరీ క్లీన్ స్వీప్ చేయడమే అని కాంగ్రెస్ వాళ్లు అంటుండటం కాస్త విడ్డూరంగా ఉంది. గత లోక్ సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అన్ని లోక్ సభ సీట్లనూ నెగ్గింది. అప్పుడంటే మోడీ వేవ్ బలంగా ఉండింది. ఇప్పుడు కాంగ్రెస్ కు అలాంటి వేవ్ ఎక్కడుందబ్బా!

Tags:    

Similar News