జనసేన - కమ్యూనిస్టు పార్టీల పొత్తు ఎంత వరకూ వచ్చింది?

Update: 2019-03-11 05:00 GMT
పొత్తు చర్చల విషయంలో నెలల తరబడి డిష్కషన్లు జరగడం చూశాం. తెలంగాణ ఎన్నికల్లో మిత్ర పక్షాలకు పదిహేను సీట్లను కేటాయించడం కోసం నెల రోజుల పాటు చర్చలు జరిపింది కాంగ్రెస్ పార్టీ. అదే సమయం ప్రచారానికి ఉపయోగించి ఉంటే ఫలితాలు  మరోలా ఉండేవని పరిశీలకులు వ్యాఖ్యానించారు. అలా ఉంటుంది రాజకీయ పార్టీల కథ. రెండు మూడు సీట్ల విషయంలో బేరాలకు కూడా  చాలా సమయాన్ని వృథా చేసుకొంటూ ఉంటారు.

ఇలాంటి నేపథ్యంలో.. ఇంతకీ ఏపీలో జనసేన- కమ్యూనిస్టు పార్టీల పొత్తు  కథ ఏమిటి? అనేది చర్చనీయాంశంగా మారుతూ ఉంది. కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు అని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే.. ఇప్పటి వరకూ సీట్ల విషయంలో క్లారిటీ లేదు.

నాల్రోజుల క్రితం ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తమకు ఏయే సీట్లు కావాలో, ఎన్ని సీట్లు కావాలో.. పవన్ కల్యాణ్ కు విన్నపాన్ని చేశారు. అయితే ఇంతలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. వచ్చే సోమవారం నామినేషన్లను దాఖలు చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ నేపథ్యంలో పొత్తు కథ ఏమవుతుంది? వారం రోజుల్లో వీరు తేల్చేస్తారా అనేది ఆసక్తిదాయకంగా మారింది!

మరోవైపు జనసేన పొత్తుతో సంబంధం లేకుండా అన్ని స్థానాలకూ అభ్యర్థుల కోసం దరఖాస్తులను తీసుకుంది. పద్నాలుగు  వందలకు పైగా దరఖాస్తులు వచ్చాయట. వారిలో ధీటైన వారెవరు, తాలు సరకు ఏది..అనేది చర్చనీయాంశంగా మారింది.

ఇలాంటి నేపథ్యంలో పవన్ అభ్యర్థులుగా ఎవరిని తేలుస్తున్నారనేది ఆసక్తిదాయకంగా నిలుస్తోంది. కమ్యూనిస్టులకు ఏ సీట్లను కేటాయిస్తారు.. వారం రోజుల్లో పవన్ అన్ని స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేయాల్సిన పరిస్థితుల్లో.. జనసేన రాజకీయం కూడా రసవత్తరంగా మారింది!
Tags:    

Similar News