జోడో యాత్ర వేళ.. కాంగ్రెస్‌ పదవికి మరో ముఖ్య నేత రాజీనామా!

Update: 2022-11-17 07:30 GMT
రాజస్థాన్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్, సీనియర్‌ నేత అజయ్‌ మాకెన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన రాజస్థాన్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. అందులోనూ ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పాదయాత్ర మరో రెండు వారాల్లో రాజస్థాన్‌లో ప్రవేశించనుంది. ఇలాంటి కీలక సమయంలో అజయ్‌ మాకెన్‌ రాజీనామా చేయడం కలకలం రేపుతోంది.

కాగా రాజస్థాన్‌లో ఇటీవల సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌ సీఎంగా ఉన్న అశోక్‌ గెహ్లోత్‌ను కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలని సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ నిర్ణయించారు. ఈ మేరకు అశోక్‌ గెహ్లోత్‌ను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని చేపట్టాలని కోరారు.

అయితే అశోక్‌ గెహ్లోత్‌ ముఖ్యమంత్రిగా ఉండటానికి ఇష్టపడ్డారు. అంతేకాకుండా తాను సీఎంగా రాజీనామా చేస్తే తన స్థానంలో తన ప్రత్యర్థి, గతంలో కొంతమంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు లేవనెత్తిన మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ను సీఎం చేసే అవకాశం ఉండటంతో అశోక్‌ గెహ్లోత్‌ రాజీనామాకు ఒప్పుకోలేదు.

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీకి రాజస్థాన్‌లో ఉన్న 107 మంది ఎమ్మెల్యేల్లో 90 మందికిపైగా అశోక్‌ గెహ్లోత్‌ సీఎంగా కొనసాగాలని కోరుకోవడం, ఆయనకు తప్ప మరెవరికీ తాము మద్దతివ్వబోమని ఏకంగా స్పీకర్‌ వద్దకు వెళ్లి తమ బల నిరూపణ చేయడం వంటి పరిణామాలు కాంగ్రెస్‌ అధిష్టానంలో ఆగ్రహం నింపాయి.

ఈ వ్యవహారాలన్నీ అశోక్‌ గెహ్లోత్‌ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని రాజస్థాన్‌ పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న అజయ్‌ మాకెన్‌.. కాంగ్రెస్‌ అధిష్టానానికి నివేదిక ఇచ్చారు. వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అయినా ఇంతవరకు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఎమ్మెల్యేల తిరుగుబాటు వ్యవహారంలో అశోక్‌ గెహ్లోత్‌ మంత్రివర్గంలోని ముగ్గురు మంత్రులు కీలక పాత్ర పోషించారని అజయ్‌ మాకెన్‌ తన నివేదికలో పేర్కొన్నారు. శాంతి ధరిలాల్, మహేశ్‌ జోషి, ధర్మేంద్ర రాథోడ్‌లపై చర్యలు తీసుకోవాలన్నారు. వీరే కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశాలు ధిక్కరించి.. ప్రత్యేకంగా ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి అశోక్‌ గెహ్లోత్‌కు జై కొట్టించారని పేర్కొన్నారు. అయితే ఇంతవరకు వారిపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఎలాంటి చర్యలు చేపట్టలేదు.

దీంతో రాష్ట్ర ఇన్‌చార్జిగా ఉన్న తన మాటకే విలువ లేనప్పుడు తాను పదవిలో ఉండటం సరికాదని అజయ్‌ మాకెన్‌ అప్పట్లోనే రాజీనామా చేశారు. అయితే మల్లిఖార్జున ఖర్గే అంగీకరించలేదు. దీంతో అజయ్‌ మాకెన్‌ అప్పట్లో వెనక్కి తగ్గారు. అయినా ఇంతవరకు వారిపై చర్యలు చేపట్టకపోవడంతో తన పదవిని పూర్తిగా తప్పుకున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News