వైరస్ విజృంభణ...వంతెన పై సామూహిక భోజనాలు - ఆ దేశస్తులకి భయం లేదట!

Update: 2020-07-01 17:30 GMT
ప్రస్తుతం ప్రపంచం మొత్తం మహమ్మారి భయంతో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకే భయపడుతుంటే.. అక్కడ ఏకంగా నడి రోడ్డుపై భోజనాలే చేశారు. వంతెన మీదకు ఎక్కి కలిసికట్టుగా విందు ఆరగించారు. వారిలో ఎవరూ మాస్కు పెట్టుకోలేదు. కనీసం భౌతిక దూరం కూడా పాటించలేదు. పైగా ఒకరి ఆహారాన్ని మరొకరు పంచుకుంటూ ఆనందంగా గడిపేశారు. మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో పనులేంటి అని తిట్టుకుంటున్నారా?

అయితే, వారికి ఆ భయం లేదు. ఎందుకంటే.. ఆ దేశంలో కరోనా కేసులు దాదాపు తగ్గిపోయాయి. కొత్తగా కేసులు కూడా నమోదు కావడం లేదు. దీంతో ప్రజల్లో ధైర్యం నింపేందుకు ప్రభుత్వమే సామూహిక భోజనాలు చేసేందుకు అనుమతి ఇచ్చింది.చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్‌లో ఇది చోటుచేసుకుంది. కరోనా వైరస్‌కు గుడ్‌బై చెబుతూ.. మంగళవారం మెడీవల్ చార్లెస్ బ్రిడ్జి మీద ఈ విందు కార్యక్రమం జరిగింది. ఓండ్రేజ్ కోబ్జా అనే వ్యక్తి ఆధ్వర్యంలో వ్లతవ నదిపై ఉన్న వంతెన మీద సుమారు 500 మీటర్ల పొడవైన టేబుల్ ఏర్పాటు చేశారు.వందలాది మంది తమతో తెచ్చుకున్న ఆహారం, డ్రింక్స్‌ను పంచుకుంటూ వేడుక చేసుకున్నారు.

ఈ సందర్భంగా కోబ్జా మాట్లాడుతూ.. ‘‘మనం భయపడకూడదు. మనం ఇంట్లోనే ఉండిపోకూడదని చెప్పేందుకే ఈ కార్యక్రమం నిర్వహించాం’’ అని తెలిపారు. 10.7 మిలియన్ జనాభా కలిగిన చెక్ రిపబ్లిక్‌లో 11,960 మందికి కరోనా వైరస్ సోకింది. 349 మంది వైరస్‌తో చనిపోయారు. ఇంకా 3,835 మంది వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే 7,776 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కొత్తగా కేసులేవీ నమోదు కాకపోవడంతో ప్రభుత్వం లాక్‌డౌన్ నుంచి సడలింపులు చేసింది
Tags:    

Similar News