కాంగ్రెస్ జెండా రంగు మారితే?

Update: 2022-08-04 05:48 GMT
ఆజాదీ కా అమృతోత్స‌వ్  అని కేంద్రం హంగామా చేస్తోంది. స్వాతంత్ర్యం వ‌చ్చి 75 ఏళ్లు పూర్తి కానున్న‌ వేళ పండుగ చేస్తోంది. ఇవ‌న్నీ బాగానే ఉన్నాయి కానీ  జెండా విష‌య‌మై మ‌ళ్లీ మ‌రో చ‌ర్చ న‌డుస్తోంది. మ‌న దేశ జాతీయ జెండాకు, కాంగ్రెస్ జెండాకు పెద్ద‌గా తేడాలేమీ లేవు. కొన్ని సంద‌ర్భాల్లో రెండూ  ఒక్క‌టే అన్న భ్ర‌మ కూడా జ‌నంలోనే ఉంది.

కనుక కాంగ్రెస్ పార్టీ ఇక‌పై త‌న జెండాను మార్చుకోవ‌డ‌మో లేదా దేశ జెండాను మార్చి మ‌రో కొత్త రూపు తీసుకుని రావ‌డ‌మో చేస్తే బాగుంటుంది అన్న వాద‌న వినిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఓ చర్చ నడుస్తోంది. మువ్వ‌న్నెల మధ్య అశోక చ‌క్రం అన్న‌ది ఉంచితే జాతీయ జెండా, అదే స్థానంలో హ‌స్తం గుర్తు ఉంచితే కాంగ్రెస్ పార్టీ జెండాగా ఇంత కాలం చెలామ‌ణీలో ఉంది. మ‌రి ! 75 ఏళ్లు పూర్తి  కావ‌స్తున్నా ఎవ్వ‌రూ వీటిపై ఎందుక‌ని దృష్టి సారించ‌డం లేదు ఎందుక‌ని అని ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్నిస్తున్నారు.

ముఖ్యంగా దేశ జెండాకు కానీ  లేదా దానిని వాడే  ప‌ద్ధ‌తిలో  కానీ తప్పుల‌న్న‌వి రాకూడ‌దు. ఇంకా చెప్పాలంటే ఎన్నిక‌ల వేళ దేశ జెండా క‌న్నా కాంగ్రెస్ జెండానే ఎక్కువ‌గా రెప‌రెప‌లాడుతుంది. అదే సంద‌ర్భంలో ఓ విధంగా అవ‌మానానికి కూడా గురి అవుతోంది. వివిధ ర్యాలీల సంద‌ర్భంగా వాటిని తీసుకువ‌చ్చాక, స‌భ పూర్త‌య్యాక వ‌దిలేసి కింద ప‌డేసి వెళ్లిపోతున్నారు. ఇదే స‌మ‌యాన అవి చెత్త బుట్ట‌లోకి చేరిపోతున్నాయి. మువ్వ‌న్నెల జెండా ఎలా చూసుకున్నా ఓ దేశ ఆత్మ గౌర‌వానికి ప్ర‌తీక.

మధ్య‌లో గుర్తు తేడాతో ఇంత కాలం ఈ జెండా కాంగ్రెసోళ్ల‌కు పేటెంట్ అయిపోయింద‌న్న వాదన కూడా ఉంది. క‌నుక ఓ వాద‌న ప్ర‌కారం పింగ‌ళికి గౌర‌వం ఇవ్వాలంటే కాంగ్రెస్ జెండా అయినా మారాలి లేదా  దేశ జెండాను పోలి మ‌రో పార్టీజెండా ఉండ‌కూడ‌దు అన్న  నిబంధ‌న‌ను అయినా త‌ప్పక పాటించాలి. ఇవేవీ లేన‌ప్పుడు జెండా రంగును అయినా మార్చాలి.ఈ నేప‌థ్యంలో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, ప్ర‌ముఖ పాత్రికేయ పాఠ‌శాల‌ల్లో జర్నలిజం అధ్యాప‌కులు నాంచార‌య్య మెరుగుమాల తన సోషల్ మీడియాలో ఇలా రాసుకున్నారు.

"భారత జాతీయ పతాకం, భారత జాతీయ కాంగ్రెస్ జెండా రంగులూ ఒక్కటే. పైన కాషాయం, దిగువున ఆకుపచ్చ రంగుల మధ్య ఉన్న తెలుపుపై ముద్రించే గుర్తులే వేరు. జాతీయ పతాకం తెలుపుపై అశోక ధర్మచక్రం ఉంటే, కాంగ్రెస్ తెలుపుపై ముద్రించేది దాని చేయి గుర్తు. మరి జాతీయ పతాకాన్ని 80 శాతం పోలి ఉన్న (మూడు రంగుల విషయంలో) కాంగ్రెస్ జెండాను భారత ఎన్నికల సంఘం, చట్టాలు 75 ఏళ్లుగా ఎలా అనుమతిస్తున్నాయో చెప్పాల్సిన బాధ్యత ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.

ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, గృహ మంత్రి అమిత్ షా జాతికి వివరణ ఇచ్చుకోవాలి. భాజాకాం (INC) అంటే టీనేజీ నుంచే వ్యతిరేకించిన మాబోటోళ్లకు జాతీయ పతాకం ఎందుకో మరి కాంగ్రెస్ జెండాలా కనిపిస్తది. కాంగ్రెస్ పార్టీపై ఉన్న కోపం ఖద్దరు మీదకు మళ్లినట్టు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అందుకే ఈ రెండు మువ్వన్నెల పతాకాల్లో ఎదో ఒకటి రంగు మార్చుకోవాలి. రెండూ మార్చుకున్నా శుభమే. భాజపా హయాంలో మువ్వన్నెల జాతీయ పతాకం-తనలోని మొదటి రంగు పూర్తి కాషాయంలోకి మారినా మంచిదే. అలాగే, కాంగ్రెస్ మూడు రంగుల జెండాలోని మూడోది, చివరిదైన-పూర్తి ఆకుపచ్చలోకి అది మారినా దేశానికి క్షేమమే. ఈ మార్పులేవో 2024 పార్లమెంటు ఎన్నిక్షల్లోగా జరిగితే 145 కోట్ల మంది ఇండియన్లకు మేలు జరుగుతుంది.."అని అభిప్రాయ‌ప‌డుతున్నారాయ‌న. దీనిపై బీజేపీ వ‌ర్గాలు కానీ కాంగ్రెస్ వ‌ర్గాలు కానీ ఏవిధం అయిన అభిప్రాయం చెబుతారో చూడాలిక !
Tags:    

Similar News