ఫోరం ఫర్ బెటర్ బీజేపీ... కాపుల మీటింగ్ వెనక?

Update: 2022-02-28 08:40 GMT
కాపులు ఏపీలో రాజకీయాలను శాసించే స్థితిలో ఉన్నారు. 2014 ఎన్నికలు విభజన తరువాత జనావేశానికి దర్పణం పడితే ఆ ఊపులో చంద్రబాబు పవర్ లోకి వచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో ఏపీకి తీరని అన్యాయం జరిగిందని బీజేపీ టీడీపీలను పక్కన పెట్టి వైసీపీని జనాలు నీరాజనాలు పట్టారు. అలా గత రెండు ఎన్నికలకూ రెండు కారణాలతో వేవ్ అన్నది గట్టిగా  ఏర్పడింది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం వేవ్ అన్నది ఉండదు అని అంచనా వేస్తున్నారు. జగన్ సీఎం కావాలన్న కోరిక తీరింది, ఆయన పాలననూ చూశారు, విభజన ఏపీ దశ, దిశ మార్చే నవ నిర్మాణ సారధి ట్యాగ్ తో చంద్రబాబుకు కూడా మరోసారి వేవ్ వచ్చే సీన్ అయితే లేదు.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే సామాజిక సమీకరణలు కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఏపీలో చూస్తే దాదాపుగా 28 శాతానికి పైగా కాపులు ఉన్నారు. వారు ఎవరి వైపు మొగ్గితే వారే రేపటి ఏపీకి రారాజు అవుతారు. అయితే కాపులలో ఐక్యత అన్నది పెద్ద సమస్యగా ఉంది. అలాగే కాపులు ఒక్కటిగా కలిస్తే మిగిలిన సామాజిక వర్గాలు దూరం అవుతాయి. ఆ విధంగా కాపుల రాజకీయ లక్ష్యం నెరవేరే అవకాశాలు ఎంతమాత్రం ఉండవు.

అందుకే ఇపుడు కాపులు కేవలం తాము ఒక్కరితోనే కాకుండా బహుజనులు, ఆర్ధికంగా  ఇబ్బందులు పడుతున్న అగ్ర వర్ణాలను, దళితులను కలుపుకుంటూ విశాలమైన రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. దానికి ప్రాతిపదికగానే ఫోరం ఫర్ బెటర్ ఏపీ అన్న రాజకీయేతర  వేదిక ఆవిర్భవించింది. దీనికి చైర్మన్ గా మాజీ డీజీపీ సాంబశివరావుని ఎన్నుకున్నారు.

ఇక వైసీపీ తప్ప మిగిలిన పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, మాజీ ఐపీఎస్, ఐఎ ఎస్ అధికారులు అంతా కాపుల భేటీలలో పాలుపంచుకుంటున్నారు. ఇప్పటికి రెండుసార్లు హైదరాబాద్ లో జరిగిన ఈ భేటీ ఫస్ట్ టైమ్ విశాఖలో జరిగింది. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, వట్టి వసంతకుమార్ లాంటి వారు ఈ భేటీలో ముఖ్యులుగా ఉన్నారు.

ఇప్పటికి మూడు సార్లు సమావేశం అయిన కాపు నేతల భేటీ తేల్చినది ఏంటి అంటే కేవలం కాపులు ఐక్యతగా ఉంటే సరిపోదని, మిగిలిన వర్గాల వారు కూడా జత కలవాలని. దాని మీదనే మరింత ముమ్మర కసరత్తు కోసం ఫోరం ఫర్ బెటర్ ఏపీని ఏర్పాటు చేశారు. అయితే ఇది కొన్నాళ్ళ తరువాత  రాజకీయ వేదికగా కూడా రూపాంతరం చెందుతుంది అంటున్నారు

ఇక రాజకీయాల్లో చూస్తే ఇపుడు బీజేపీ, జనసేన ఒక కూటమిగా ఉన్నాయి. వైసీపీ, టీడీపీ మరో వైపు ఉన్నాయి. జనసేన నేత పవన్ కళ్యాణ్ కాపు యువతకు ఆరాధ్య నాయకుడుగా ఉన్నారు. బీజేపీలో గత రెండు విడతలుగా కాపులే ప్రెసిడెంట్లుగా ఉన్నారు. ఈ మధ్యన కాపుల రిజర్వేషన్లతో పాటు, వారి సమస్యల మీద బీజేపీ గట్టిగా గొంతు చేస్తోంది.

దాంతో ఏపీలో కాపుల ఓట్లను గంపగుత్తగా తన సొంతం చేసుకోవాలని ఆ పార్టీ చూస్తోంది. ఇపుడు ఫోరం ఫర్ బెటర్ ఏపీ వేదిక కూడా బీజేపీకి మేలు చేయడానికే అన్న చర్చ అయితే వస్తోంది. కాపుల లక్ష్యం నెరవేరాలీ అంటే అది బీజేపీ జనసేన కూటమితోనే సాధ్యం. వచ్చే ఎన్నికల తరువాత కాపు నేత సీఎం కావాలీ అంటే ఈ కూటమిని బలపరిస్తేనే అది సాధ్యమవుతుంది.

ఈ నేపధ్యంలో వరస కాపుల భేటీ, ఈ హంగామా అంతా కూడా బీజేపీ కోసమే అంటున్నారు. బీజేపీ మాస్టర్ ప్లాన్ లో భాగంగానే ఈ మీటింగులు జరుగుతున్నాయని అనుమానిస్తున్నారు. మొరి ఫోరం ఫర్ బెటర్ ఏపీనా, బీజేపీనా అన్నది తేలాలీ అంటే కొంత సమయం పడుతుంది. ఏది ఏమైనా ఏపీలో కొత్త రాజకీయం కోసం అంటున్న కాపుల కదలికల మీద అందరి దృష్టి ఉందని చెప్పాలి.
Tags:    

Similar News