పోటీ చేయను.. సంచలనంగా మారిన జగ్గారెడ్డి వ్యాఖ్య

Update: 2022-09-08 05:12 GMT
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెడ్ల జగదీశ్వర్ అలియాస్ జగ్గారెడ్డి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టకుండా విమర్శలు గుప్పిస్తూ.. తరచూ టార్గెట్ చేయటం తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీని వీడిపోతారంటూ తరచూ ప్రచారం జరిగినా.. ఆయన మాత్రం పార్టీలోనే కొనసాగుతుండటం తెలిసిందే. తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ఆయన.. తాజాగా సంచలన వ్యాఖ్య చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని స్పష్టం చేశారు.

ఆయన పోటీ చేయకపోతే ఎవరు చేస్తారు? అన్న సందేహానికి సమాధానం ఇచ్చేశారు. తన నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త పోటీ చేస్తారన్నఆయన.. ఒకవేళ పార్టీ శ్రేణులు కార్యకర్తను వద్దని చెబితే.. తన సతీమణి నిర్మలను ఎన్నికల బరిలో దింపుతానని పేర్కొన్నారు.ఎందుకిలా? అనే దానికి సమాధానం ఇవ్వని ఆయన.. చివర్లో మరో ట్విస్టు ఇచ్చారు.

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన ఆయన.. 2028లో జరిగే ఎన్నికల్లో మాత్రం పోటీ చేస్తానంటూ వ్యాఖ్యానించటం గమనార్హం.

తాజాగా జగ్గారెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రేవంత్ మీద ఉన్న కోపంతో పోటీ చేయటం లేదా? మరింకేమైనా కారణం ఉందా? అన్న దానిపై క్లారిటీ రావట్లేదు కానీ.. బరిలో దిగితే గెలుపు పక్కా అన్నట్లు ఉండే జగ్గారెడ్డి ఎన్నికలకు దూరంగా ఉంటానని చెప్పిన వ్యాఖ్య రాజకీయ సంచలనంగా మారింది.

జగ్గారెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఎవ్వరూ స్పందించలేదు. మొత్తంగా ఏదోలా వార్తల్లో ఉండే ఆయన.. తన ఇమేజ్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఆయన తాజా ప్రకటన ఉందంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News