టీ సర్కార్ మరో కీలక నిర్ణయం ..ఏపీ - మహారాష్ట్రలకు వెళ్ళకుండా నిషేధం!

Update: 2020-05-01 12:30 GMT
తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఒకవైపు ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుంటే ..తెలంగాణలో కేసుల సంఖ్య తగ్గుతుంది. క‌రోనా క‌ట్టడిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌లు స‌త్ప‌లితాల‌ను ఇస్తున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణా రాష్ట్రంలో 1,038 కేసులు నమోదు కాగా , ఈ కేసుల్లో 568 యాక్టివ్ గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 442 కేసులు రికవర్ కాగా ఇప్పటి వరకు 28 మంది మృతి చెందారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ, మహారాష్ట్రలలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వాసులు ఎవరూ ఆయా రాష్ట్రాలకు వెళ్లకుండా సర్కారు నిషేధం విధించింది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ అయినట్టు చెబుతున్నారు. తెలంగాణా రాష్ట్రానికి సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్ , మహారాష్ట్ర రాష్ట్రాల్లో క‌రోనా తీవ్రత ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో సరిహద్దు జిల్లాలలో నివసిస్తున్న పౌరులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరూ ఆ జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు వెళ్లొద్దు అని ఆదేశాలు జారీ చేసింది .

మెడిక‌ల్ ట్రీట్మెంట్, ఎమ‌ర్జెన్సీ ప‌నుల‌కు కూడా ఏపీ - మహారాష్ట్రల్లోకి వెళ్లడానికి వీలు లేదని సరిహద్దుల్లోని ప్రాంతాల ప్రజలను ఆదేశించింది. ఈ నిర్ణ‌యాన్ని అమ‌లు చెయ్య‌డానికి పోలీసు బలగాలను సైతం పెంచిన తెలంగాణా సర్కార్ కరోనా కట్టడి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఏపీలో ఇప్పటి వరకు 1,403 కేసులు నమోదు కాగా 1,051 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక మహారాష్ట్రలో 10,498 కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈ కేసుల్లో యాక్టివ్ గా 8,266 కేసులు ఉన్నాయి.
Tags:    

Similar News