కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం...క‌త్తిదూసేందుకేనా?

Update: 2018-01-26 13:34 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇకపై ఎదుటివారిని ఉద్దేశించి పరుష పదజాలం వాడినా, దూషించినా, బెదిరించినా, నోరు జారినా నేరుగా పోలీసులే రంగంలోకి దిగుతారు. కోర్టు అనుమతి లేకుండానే కేసు నమోదు చేసి విచారణ చేపడతారని కీలక నిర్ణయం రాష్ట్ర సర్కారు తీసుకుంది. ఐపీసీ 506, 507 సెక్షన్ల కింద నమోదైన కేసులను కోర్టు అనుమతి లేకుండానే విచారించదగిన (కాగ్నిజబుల్‌) నేరాలుగా గుర్తించింది ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన ఫైల్‌ పై సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు.

ఈ కొత్త చ‌ట్టం ప్ర‌కారం పరుష పదజాలంతో బెదిరించడం - దూషించడం ఈ సెక్షన్ల కింద నేరాలుగా పరిగణిస్తారు. అయితే ఈ నేరాల కింద కేసు నమోదు చేయడానికి కోర్టు అనుమతి తీసుకోవాలా లేదా అనుమతి లేకుండానే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలా అన్న అంశం రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణ కిందకు వస్తుంది. ఆయా రాష్ట్రాలే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కోర్టు అనుమతి లేకుండానే కేసు నమోదు చేసి విచారణ చేపట్టే నేరంగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పంచాయతీ - సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ కు వ్య‌తిరేకంగా - ఆయ‌న పాల‌న‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్న తీరును విశ్లేషించే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కొద్దికాలం క్రితం ఓ వ్య‌క్తి ఫేస్‌ బుక్‌ లో కేసీఆర్‌ కు వ్య‌తిరేకంగా పోస్ట్ పెట్టినందుకు ఆయ‌న ఐపీ వివ‌రాలు ఇవ్వాల‌ని తెలంగాణ స‌ర్కారు ఏకంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ‌ను ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసింది. ఫేస్‌ బుక్ ద్వారా తమ కోరిక‌కు ప‌రిష్కారం దొర‌క్క‌పోవ‌డంతో ఈ చ‌ర్య‌కు దిగింది. ఇలా ప‌ట్టువద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతున్న స‌మ‌యంలో..తాజా నిర్ణ‌యం ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తుందోన‌నే చ‌ర్చ సాగుతోంది.
Tags:    

Similar News