కొర్రీల బంగ్లా.. కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ అంటూ ఏడుపు

Update: 2022-11-03 15:30 GMT
క్రీజులో బ్యాటింగ్ చేస్తున్న బ్యాట్స్ మన్ కానీ.. ఫీల్డ్ అంపైర్ కానీ.. మైదానంలోని ఫీల్డర్ తప్పు చేస్తున్నట్లు భావించలేదు. కానీ, డ్రెస్సింగ్ రూమ్ లోని ఆటగాడు మాత్రం అభ్యంతరం చెబుతున్నాడు.. ఫేక్ ఫీల్డింగ్ అంటూ అక్కసు వెళ్లగక్కుతున్నాడు. అంపైర్లు గుర్తించి ఉంటే తమకు 5 పరుగులు వచ్చేవని.. తామే గెలిచేవారమని గొంతుచించుకుంటున్నాడు. ఆ ఆటగాడు బంగ్లాదేశ్ క్రికెటర్ నురుల్ హసన్ కాగా.. అతడు ఆరోపణలు చేస్తున్నది భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి మీద.

అసలేం జరిగింది.. టి20 ప్రపంచ కప్ లో బుధవారం బంగ్లాదేశ్ పై టీమిండియా ఐదు పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఆఖరి బంతికి సిక్స్ కొడితే మ్యాచ్ టై అయ్యే పక్షంలో సింగిల్ మాత్రమే వచ్చింది. చివరి ఓవర్‌లో 20 పరుగులు చేయాల్సి ఉండగా..అర్షదీప్ సింగ్ వేసిన ఆ ఓవర్ లో నురుల్‌ సిక్స్, ఫోర్ బాదాడు. అయితే, ఆ తర్వాత అర్షదీప్‌ కట్టడి చేయడంతో  14 పరుగుల మాత్రమే వచ్చాయి. ఇక హసన్ ఆరోపిస్తున్న ఫేక్ ఫీల్డింగ్.. వర్షంతో ఆటకు అంతరాయం కలగక ముందు జరిగింది. అది బంగ్లా ఇన్నింగ్స్ ఏడో ఓవర్. బౌలర్ అక్షర్ పటేల్. బంగ్లా ఓపెనర్ నజ్ముల్ హుస్సేన్ శాంతో.. డీప్ మిడ్ వికెట్ వైపు షాట్ కొట్టాడు. దానిని అర్షదీప్ అందుకున్నాడు. కీపర్ దినేశ్ కార్తీక్ కు త్రో చేశాడు. ఆ బంతి అలా వెళ్తుండగానే.. విరాట్ కోహ్లీ.. .తన చేతిలో బంతి లేకున్నా..

నాన్ స్ట్రైకర్ వైపు బంతిని త్రో చేసినట్లు హావభావాలు ప్రదర్శించాడు. వాస్తవానిని ఇలాంటిది జరిగినప్పుడు బ్యాట్స్ మెన్ (అప్పటకి క్రీజులో ఉన్నది లిటన్ దాస్, నజ్ముల్) అంపైర్లకు ఫిర్యాదు చేయొచ్చు. లేదా అంపైర్లే నేరుగా గమనిస్తే దానిమీద చర్య తీసుకోవచ్చు. అప్పుడు ఐసీసీ రూల్‌ 41.5 ప్రకారం బ్యాటర్‌ పరుగు తీసే సమయంలో ఫీల్డర్‌ ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా మోసం చేసినట్లు, అవరోధం కల్పించ కూడదు. ఒక వేళ ఈ నిబంధన ఉల్లంఘించినట్లు అంపైర్లు గుర్తిస్తే బ్యాటింగ్‌ చేసే జట్టుకు అదనంగా ఐదు పరుగులు ఇచ్చే అవకాశం ఉంది. అలానే సదరు బంతిని డెడ్‌గా ప్రకటించొచ్చు. అలాగే 28.2.3 రూల్‌ ప్రకారం.. ఫీల్డర్‌ అన్యాయంగా వ్యవహరించాడని అంపైర్లు గుర్తిస్తే నో బాల్‌ కూడా ఇవ్వొచ్చు. బ్యాటింగ్‌ జట్టుకు ఐదు పరుగులను ఇచ్చే విషయంలో తుది అధికారం ఫీల్డ్‌ అంపైర్లదే. అయితే ఫీల్డర్‌ ఇలా చేశాడని బ్యాటర్ సదరు అంపైర్ దృష్టికి తీసుకెళ్లే హక్కు ఉంది. ఫీల్డ్‌ అంపైర్లు చర్చించి.. అవసరమైతే పైస్థాయిలో ఉండే వారికి నివేదించి చర్యలు తీసుకొంటారు. కానీ ఇక్కడ అలా ఏమీ జరగలేదు.

ఐదు పరుగులతో ఓటమితో అక్కసు తీరా జట్టు 5 పరుగుల తేడాతో ఓడిపోవడంతో.. అది కూడా అతడు క్రీజులో ఉండగా.. చివరి బంతికి లక్ష్యాన్ని సాధించలేకపోవడంతో నూరుల్ హసన్ అక్కసు వెళ్లగక్కుతున్నాడు. మరోవైపు కోహ్లీది ఫేక్ ఫీల్డింగ్ అని ఆరోపణ చేసి అంపైర్లకు చెప్పినా.. అప్పటికే బంగ్లా ఓపెనర్లు క్రీజ్‌కు చేరువగా వెళ్లిపోయారు. ఇక ఆ వెంటనే 7వ ఓవర్‌ ముగిసింది. వర్షం పడి మ్యాచ్‌కు అడ్డంకి వచ్చింది. దీంతో బంగ్లా లక్ష్యాన్ని 16 ఓవర్లలో 151గా కుదించారు. కానీ ఆ జట్టు  145 పరుగులే చేయగలిగింది.

అది సరదాగా చేసింది.. అతి చేయొద్దంటూ భారత ఫ్యాన్స్ "మ్యాచ్‌ తిరిగి ప్రారంభమైన సమయంలో చిత్తడిగా ఉన్న అవుట్‌ ఫీల్డ్‌ ప్రభావం చూపించింది. అయితే, ఇక్కడ ఫేక్ త్రో (కోహ్లిని ఉద్దేశించి) కూడా కీలక పాత్ర పోషించింది. దాని వల్ల మాకు ఐదు పరుగులు అదనంగా లభించాల్సి ఉంది. కానీ, అలా జరగలేదు"అంటూ ఫీల్డ్‌ అంపైర్లు క్రిస్‌ బ్రౌన్, ఎరాస్మస్‌లతోపాటు విరాట్ కోహ్లీని విమర్శిస్తూ నూరుల్ మాట్లాడాడు. కానీ, దీనిపై భారత అభిమానులు ఇందులో 'ఫేకు' గీకు ఏమీలేదని కొట్టిపారేస్తున్నారు. ఓడిపోయినప్పడు సాకులు వెదుక్కుని ఏడవడం బంగ్లాకు అలవాటేనని చెబుతున్నారు. మైదానంలో ఎంతో చురుగ్గా ఉండే కోహ్లి.. సరదాగా చేసిన పనిని 'ఫేక్ ఫీల్డింగ్‌'అంటూ తప్పుబట్టవద్దని సూచిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News