తన కోరిక ఏమిటో చెప్పిన పవన్ కల్యాణ్

Update: 2022-03-25 03:45 GMT
దేశంలో ఇంత మంది అధినేతలు.. నేతలు ఉన్నారు. కానీ.. వారిలో ఏ ఒక్కరు చెప్పని ఒక మాటను జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోటి నుంచి వచ్చింది. నేతాజీ అస్తికలు భారత్ కు తీసుకురావాలని.. ఎర్రకోటలో భద్రంగా ఉంచాలని.. ఆయన అస్తికల మీద మువ్వన్నెల జెండాను కప్పాలన్న తన కోరికను బయటపెట్టారు. రాజకీయం అంటే నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. వ్యవస్థల్ని ఛిద్రం చేసే మాటల్ని చెప్పటం.. ప్రజల మధ్య ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి విభజనను పెంచేలా చేయటం.. ద్వేష భావాల్ని వ్యాపింపచేయటం లాంటివి మినహా మరేదీ రాజకీయం కాదన్నట్లుగా వ్యవహరించే వారికి షాకిచ్చారు పవన్.

కుళ్లు పట్టిన.. భ్రష్టు పట్టిన రాజకీయాలంటూ నిత్యం తిట్టుకోవటమే తప్పించి.. అలాంటి వాటి నుంచి కూడా ఒక మంచిని తయారు చేసేందుకు ఎందుకు మనసు పెట్టకూడదన్న భావన కలిగే నేతలు ఎంత మంది ఉన్నారు? చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకునే కన్నా.. ఏ వెలుగు కోసం తపిస్తున్నారో.. అదే వెలుగును ఇచ్చే అంశం మీద ఫోకస్ చేస్తే.. పనుల్లో మార్పు రావటం ఖాయం.

తాజాగా పవన్ కల్యాణ్ మాటల్నివింటే అదే భావన కలగక మానదు. యావత్ దేశం రోమాలు నిక్కబొడుకునేలా తన కోరికను వెల్లడించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. రాజకీయం అంటే నిత్యం తమ ప్రత్యర్థులపై విరుచుకుపడటం.. ఏదో ఒక పంచాయితీ పెట్టటం లాంటి వాటి గురించి కాకుండా.. నిజాయితీగా తన చుట్టూ ఉన్న వారి బతుకుల్లో మార్పు రావాలని తపించటం.. జాతీయ భావన పెరిగే ఆలోచనలు చేయటం లాంటివి మర్చిపోయిన నేతలు మన చుట్టూ ఉన్న వేళ.. అందరిలో కొత్త స్ఫూర్తిని నింపేలా.. అందరికి ఒక తాటి మీదకు తీసుకొచ్చే తన ఆలోచనను బయటపెట్టారు పవన్ కల్యాణ్. తాజాగా స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్  మీద రాసిన నేతాజీ పుస్తక సమీక్ష కార్యక్రమానికి హాజరైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశంలో మరే నేత ప్రస్తావించిన అంశాలు సూటిగా.. స్పష్టంగా ప్రకటించటమే కాదు.. స్వాతంత్య్రం వచ్చిన దశాబ్దాలు గడుస్తున్నా ఎవరూ ఈ మాటల్ని ఎందుకు చెప్పలేదన్న భావన కలిగేలా చేశారు. ‘నేతాజీ అస్థికలు భారతదేశానికి తీసుకురావాలి.. అదే నా కోరిక. దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి కోరికా అదే. జపాన్ లోని రెంకోజీ టెంపుల్లో ఉన్న అస్థికలు ఎర్రకోటలో ఉంచాలి.  అందరిలో నేతాజీ స్ఫూర్తి నింపాలి. ఈ సభ నుంచి దేశం మొత్తం మాట్లాడుకునేలా పిలుపునిస్తున్నా. మీ మొబైల్ ఫోన్లకు పని చెప్పండి.  బ్రింగ్ బ్యాక్ నేతాజీ యాషెస్, రెంకోజీ టూ రెడ్ ఫోర్ట్ హ్యాష్ ట్యాగ్ లు సంధించండి. ప్రభుత్వాధినేతలు, రాజకీయ నాయకుల మీద ఒత్తిడి తెద్దాం. అక్రమాలు అన్యాయాలు చేసిన వారికి స్మారకాలు కడతారు.. ఊరేగిస్తారు. జాతిలో చైతన్యం నింపిన వ్యక్తిని పట్టించుకోరా? నేతాజీ కోసం నిలబడమని అడుగుతున్నా’’ అంటూ పవన్ నోటి నుంచి వచ్చిన మాటల్ని విన్నంతనే.. ఇంతవరకు ఏ రాజకీయ అధినేత నోటి నుంచి ఈ మాటలు ఎందుకు రాలేదన్న భావన కలుగక మానదు.

“మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కోసం టోక్యో వెళ్లినప్పుడు నాడు పాస్ పోర్ట్ ఆఫీసర్ గా ఉన్న శ్రీ రాజశేఖర్ గారు ఒక చోటుకు తీసుకువెళ్లారు. మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్తికలు ఉన్న రెంకోజీ టెంపుల్ అది. నేతాజీ అస్తికలు భద్రపరిచిన ఆయన కుమార్తె అక్కడ ఉన్నారు. ఆమె నేతాజీ అస్తికలు చూపిస్తే నా హృదయం ద్రవించుకుపోయింది. మన దేశంలో అక్రమాలు, అన్యాయాలు చేసిన వారికి పెద్ద పెద్ద స్మారకాలు కడతారు. చనిపోతే పెద్ద పెద్ద ఊరేగింపులు చేస్తారు. ఇలాంటి మహానుభావుడు ఇంతటి చైతన్యం కలిగించిన వ్యక్తి ఎందుకు దిక్కు లేకుండా అయిపోయారు అని అనుకున్నా. అక్కడ ఉన్న పుస్తకంలో ఒక మాట రాశాను. నేతాజీ అస్తికలు ఒక రోజు భారతదేశంలోకి తీసుకురావాలి అని రాశాను. ఈ విషయాన్ని ఇంత వరకు ఎవరితో పంచుకోలేదు. ఇది యాదృచ్చికమే కావచ్చు. కానీ అది నేతాజీ పిలుపు’’ అని పేర్కొన్నారు.

బోస్ అస్తికలు ఆయనవో కాదో పరీక్షించాలి అనుకుంటే ఈ రోజు డీఎన్ఏ పరీక్షలు ఎన్నో వచ్చాయని.. మరి ఎందుకు తీసుకురారు? అన్నది ఓ సగటు భారతీయుడిగా తనఆవేదనగా పేర్కొన్నారు. ‘‘ఆ అస్తికలు చూస్తే నిజంగా ఏడుపు వచ్చింది. జపనీస్ సంస్కృతిలో భాగంగా పూర్వీకుల అస్తికలు దేవుడి గుడిలో భద్రపరుస్తారు. అలాంటిది ఎవరివో అక్కడ ఎందుకు పెడతారు. అవి కచ్చితంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారివి అని నేనే గాఢంగా నమ్మాను.ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు గడచిపోయాయి. ఆయన చనిపోయి 77 సంవత్సరాలు అయిపోయాయి. అయినా ఈ రోజుకీ ఎవరూ తీసుకురాలేదు. ఇప్పటికి మూడు కమిషన్లు వేశారు. అయినా ఉపయోగం లేదు. పీవీ నరసింహారావు గారు లాంటి వాళ్లు ఎవరైనా తీసుకువద్దామనుకున్నా.. వాజపేయ్ గారు లాంటి వాళ్లు ప్రయత్నించినా కుదరలేదు. దానికి కావాల్సింది ప్రజలు కోరుకోవడం. మనలాంటి వాళ్లు బలంగా కోరుకోవాలి. ఆ అస్తికలు రావాలి’’ అని కోరారు. నిజానికి పవన్ కోరిక.. యావత్ దేశం కోరిక. దాని గురించి ఇప్పటికైనా ప్రతి భారతీయుడు మాట్లాడాల్సిన సమయం వచ్చిందని చెప్పాలి.
Tags:    

Similar News