సీఎంను చేయాలంటూ కోర్టుకెక్కిన సామాన్యుడు

Update: 2018-07-07 04:43 GMT
విచిత్రంగా.. వినూత్నంగా వ్య‌వ‌హ‌రించాడో సామాన్యుడు. క‌ర్ణాట‌క‌కు చెందిన ఒక సామాన్యుడు చిత్ర‌మైన డిమాండ్‌తో కోర్టును ఆశ్ర‌యించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. కాంగ్రెస్‌పార్టీ కార్య‌క‌ర్త‌గా చెప్పుకునే స‌ద‌రు వ్య‌క్తి ఇప్ప‌టివ‌ర‌కూ వార్త‌ల్లోనానిన వ్య‌క్తి ఎంత మాత్రం కాదు. కానీ.. త‌న‌ను రాష్ట్ర ముఖ్య‌మంత్రిని చేయాలంటూ కోర్టును ఆశ్ర‌యించ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ఒక్క‌రంటే ఒక్క ఎమ్మెల్యే మ‌ద్ద‌తు లేకున్నా త‌న‌ను ముఖ్య‌మంత్రిని చేయాలంటూ కోర్టుకు ఎక్క‌టం ఒక ఎత్తు అయితే.. త‌న‌ను ఎందుకు సీఎం చేయాల‌ని కోరుతున్న‌ది చెప్పిన తీరు ఆశ్చ‌ర్యానికి గురి చేసేలా ఉంది. క‌ర్ణాట‌క‌లోని తీర్థ‌హ‌ళ్లికి చెందిన హ‌రిశ్చంద్ర గౌడ్ తాజాగా హైకోర్టులో ఒక పిటిష‌న్ వేశారు.

ఈ కేసు విచార‌ణ శుక్ర‌వారం కోర్టు ముందుకు వ‌చ్చింది. క‌ర్ణాట‌క సీఎం కుమార‌స్వామికి స్విస్ బ్యాంకులో వేలాది కోట్ల రూపాయిలు ఉన్నాయ‌ని.. త‌న‌ను కానీ సీఎంను చేస్తే స్విస్ బ్యాంకులో ఉన్న మొత్తాన్ని వెన‌క్కి తీసుకొచ్చి రాష్ట్రంలోని రైతులంద‌రి రుణాల్ని మాపీ చేస్తాన‌ని చెప్పారు. త‌న‌ను సీఎంను చేయాల‌ని గ‌వ‌ర్న‌ర్ కు విన్న‌వించుకున్నా.. ఆయ‌న ప‌ట్టించుకోలేద‌న్నారు. అత‌గాడి వాద‌న‌ను విన్న న్యాయ‌మూర్తి కేసు విచార‌ణ‌ను వాయిదా వేశారు. ఎవ‌రికి వారు.. ఏదో ఒక హామీ ఇచ్చేసి.. సీఎంను చేయాలి.. పీఎంను చేయాల‌ని అడగ‌టం ఏమిటో..?
Tags:    

Similar News