ఎవరి మాటను నమ్మాల్రా బాబు..?

Update: 2015-12-20 17:30 GMT
నేషనల్ హెరాల్డ్ కేసులో శనివారం పాటియాలా హౌజ్ కోర్టుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. ఆ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలు హాజరు కావటం తెలిసిందే. ఇంత కీలక పరిణామానికి సంబంధించిన వార్తను.. ఒకటికి నాలుగు పేపర్లు చదవాలని చూసినోళ్లు కన్ఫ్యూజన్ కావాల్సిందే. చివరకు.. సందేహాలతో పేపర్లు మూయాల్సిందే.

సోనియా లాంటి అతి శక్తివంతమైన నేత.. కోర్టు గడప తొక్కటం అంత చిన్న విషయమేమీ కాదు. అలాంటి కీలక పరిణామానికి సంబంధించి ఒక్కో దినపత్రిక ఒక్కోలా రిపోర్ట్ చేయటం గమనార్హం. సోనియమ్మ.. రాహుల్ కోర్టుకు వచ్చారు.. న్యాయమూర్తి ముందు హాజరయ్యారు.. ఆయన వీరికి బెయిల్ ఇచ్చారన్న విషయం అన్ని పత్రికల్లో కామనే అయినా.. కోర్టులో ఎంతసేపు ఉన్నారు? బెయిల్ కోసం ఎంత సమయం తీసుకున్నారు? ఎంతసేపట్లో బెయిల్ వచ్చేసిందన్న విషయంపై ఏ పత్రికకు ఆ పత్రిక లెక్కలు చెప్పిన తీరు చూస్తే.. ఎవరు తప్పు.. ఎవరు రైటో తెలీని పరిస్థితి.

పెద్దపెద్ద పేరున్న మీడియా సంస్థలే ఇలా రాసేస్తే ఎలా? అన్న ప్రశ్న ఉదయించక మానదు. జాతీయ దినపత్రికకు వెళ్లే ముందు తెలుగు దినపత్రికల్లో ఆయా మీడియా సంస్థలు పేర్కొన్న వ్యాఖ్యను యథాతధంగా చెప్పాయి.

ఈనాడు

‘‘కోర్టులో విచారణ ప్రక్రియ 15 నిమిషాల్లో ముగిసింది. బెయిల్ తీసుకున్న అనంతరం సోనియా.. రాహుల్ చిరునవ్వుతో బయటికి వచ్చారు’’ అని పేర్కొన్నారు.

సాక్షి

‘‘శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మేజిస్ట్రేట్ ఎదుట హాజరై.. తాము నిర్దోషులమని చెప్పి బెయిల్ కోరారు. ఈ ప్రక్రియ 3 నిమిషాల్లో ముగియగా.. 3.05 గంటలకు ఇరువురు నేతలూ కోర్టు హాలు నుంచి నవ్వుతూ బయటకు వచ్చారు’’

ఆంధ్రజ్యోతి

‘‘రెండు నిమిషాలే విచారణ.. మూడో నిమిషం ముగియక ముందే బెయిల్ మంజూరు’’

టైమ్స్ ఆఫ్ ఇండియా

‘‘మధ్యాహ్నం 2.51 గంటలకు విచారణ మొదలైంది. 2.58 గంటలకు నిందితులకు బెయిల్ లభించింది. ప్రోసీడింగ్స్ పూర్తి అయ్యాయి’’

దక్కన్ క్రానికల్

‘‘గాంధీలకు బెయిల్ లభించటానికి 10 నిమిషాలు పట్టింది. మొత్తం ప్రోసీడింగ్స్ 15 నిమిషాల్లో పూర్తి అయ్యాయి’’

ద ఎకనామిక్స్ టైమ్స్

‘‘గాంధీలను విచారించి.. బెయిల్ మంజూరు చేయటానికి ఐదు నిమిషాల కంటే తక్కువ సమయమే పట్టింది’’

ద ఇండియన్ ఎక్స్ ప్రెస్

‘వాదనలు మొదలైన ‘7 నిమిషాల వ్యవధిలో సోనియా.. రాహుల్ గాంధీలు బెయిల్ పొందారు’’
Tags:    

Similar News