అక్కడ ఎన్నికల వేళ..కాంగ్రెస్ లో లుకలుకలు!

Update: 2019-07-08 05:07 GMT
త్వరలోనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో స్పష్టమైన ఓటు బ్యాంకు ఉంది. అయితే అదంతా ఒకప్పుడు అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇటీవలి లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కోలుకునే రాష్ట్రాల్లో కచ్చితంగా మహారాష్ట్ర ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే ఆ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ చిత్తు అయ్యింది.

ఈ నేఫథ్యంలో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏదో సాధిస్తుందనే లెక్కలు ఎవరికీ లేవు. అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోందనే సంకేతాలను ఇస్తున్నారు అక్కడి కాంగ్రెస్ నేతలు.

ఒకవైపు  కాంగ్రెస్ ముంబై చీఫ్ పదవికి మిలింద్ దేవ్ రా రాజీనామా చేశారు. లోక్ సభ ఎన్నికలకు ముందు ఈయనను ఆ పదవిలో నియమించింది కాంగ్రెస్ హై కమాండ్. అయితే ఎన్నికల్లో పార్టీ చిత్తు అయిపోయింది

ముంబై పరిధిలో. ఈ నేపథ్యంలో బాధ్యత వహిస్తూ మిలింద్ రాజీనామా చేసినట్టుగా ప్రకటించారు. అయితే ఈ రాజీనామాను ఆక్షేపిస్తున్నాడు కాంగ్రెస్ సీనియర్ సంజయ్ నిరుపమ్. గతంలో కాంగ్రెస్ ముంబై చీఫ్ పదవిలో ఉండేవారు నిరుపమ్. ఆయనను తొలగించే కాంగ్రెస్ హై కమాండ్ దేవ్ రాను ఆ పదవిలో నియమించింది. ఈ కోపమే మనసులో ఉందేమో కానీ.. సంజయ్ నిరుపమ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

అసలే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న బలం అంతంత మాత్రం. ఇలాంటి నేపథ్యంలో నేతలు అయినా కాస్త ఒళ్లు జాగ్రత్త పెట్టుకోవాల్సింది. కానీ.. వారే ఇలా విబేధాలతో రచ్చకు ఎక్కుతుండటం కాంగ్రెస్ పరిస్థితిని తేటతెల్లం చేస్తోందని పరిశీలకులు అంటున్నారు!




Tags:    

Similar News