ఎంఐఎం.. ఎప్పుడూ వేసే రికార్డే.. అయినా సంచ‌ల‌నంగా మారింది!

Update: 2020-11-23 15:00 GMT
గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో మ‌జ్లిస్ పార్టీ ఎంఐఎం.. నాయ‌కుడు, చార్మినార్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే.. ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో చార్మి నార్‌ నియోజకవర్గంలోని డివిజన్లలో మజ్లిస్‌ అభ్యర్థుల తరఫున విస్తృత ప్ర‌చారం చేస్తున్న ఆయ‌న‌.. టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుప‌డ్డారు. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చి కళ్లు తెరిచిన మంత్రి కేటీఆర్‌ చిలుక పలుకులు పలుకుతున్నారన్న ఆయ‌న మ‌జ్లిస్ పార్టీ ఇలాంటి వాళ్ల‌ను చాలా చూసింద‌న్నారు.

అంత‌టితో కూడా స‌రిపెట్ట‌ని ఖాన్‌.. ‘రాజకీయం మా ఇంటి గుమస్తాతో సమానం’ అని అన్నారు. తమకు రాజకీయాల్లో ఒకరిని కుర్చీమీద కూర్చోబెట్టడం తెలుసు.. కుర్చీ నుంచి దించడం సైతం తెలుసు అని టీఆర్‌ఎస్‌ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తాము త‌లుచుకుంటే.. రెండు నెల‌ల్లోనే టీఆర్ఎస్ స‌ర్కారు కూలుతుంద‌ని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. అయితే.. కొంచెం లోతుగా ఆలోచిస్తే.. ఖాన్ వ్యాఖ్య‌లు ఇప్పుడు కొత్త‌కాదు. అదేస‌మ‌యంలో ఎంఐఎం-కేసీఆర్ వ్యూహాలు ఇప్పుడు కొత్త‌వి కావు.

ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. ఇరు పార్టీలూ క‌లిసి పోటీ చేస్తుంటాయి. అదేస‌మ‌యంలో వ్యూహాత్మ‌కంగా ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటారు. గ‌త 2018 ఎన్నిక‌ల్లోనూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఒవైసీ కూడా ఇలానే విరుచుకుప‌డ్డారు. అయితే.. త‌ర్వాత మ‌ళ్లీ క‌లిసిపోయారు. ఇదంతా కేవ‌లం హైద‌రాబాద్‌లో ముస్లింల ఓట్లు చీలిపోకుండా చూసుకునే ఎత్తుగ‌డేన‌న్న‌ది.. విశ్లేష‌కుల అభిప్రాయం. ప్ర‌స్తుతం ముస్లిం వ‌ర్గాల్లోనూ అసంతృప్తి ఉంది. దీనిని క‌వ‌ర్ చేసుకునేందుకు ఎంఐఎం ప్ర‌య‌త్నిస్తోంది. అయితే.. ఎంఐఎం పైనా కొన్ని వ‌ర్గాల్లో అసంతృప్తి ఉంది.

కేసీఆర్‌తో దోస్తీ ఉన్నా.. పాత‌బ‌స్తీని అభివృద్ధి చేయ‌డం లేద‌నేది వారి వాద‌న. ఈ గ్యాప్‌ను భ‌ర్తీ చేసేందుకు అటు కాంగ్రెస్‌, ఇటు క‌మ్యూనిస్టులు కూడా ప్ర‌య‌త్నిస్తున్నారు. బీజేపీకి ఎలాగూ ఛాన్స్ లేదు. ఈ నేప‌థ్యంలో ఓట్లు చీల‌కుండా ఉండేందుకు టీఆర్ ఎస్‌, ఎంఐఎంలు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటుండ‌డం ఇటీవ‌ల రాజ‌కీయ ప‌రిణామాల్లో కామ‌న్‌గా మారింది. తెర‌మీద విమ‌ర్శించుకోవ‌డం.. తెర‌చాటు చేతులు క‌లుపుకోవ‌డం కామ‌న్ అనే మాట వినిపిస్తోంది. ఇది గుర్తించ‌లేక ఓట‌ర్లు తిక‌మ‌క‌ప‌డుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News