హైదరాబాదీయులకు గుడ్ న్యూస్.. ట్రాఫిక్ చలానాలపై రాయితీ?

Update: 2022-02-19 04:34 GMT
హైదరాబాదీయులకు గుడ్ న్యూస్. అయితే.. హైదరాబాద్ మహానగరం పేరుకు ఒకటే అయినా.. సాంకేతికంగా చూసినప్పుడు దాని పోలీసింగ్ బాధ్యతలను మూడు ముక్కలు చేసి.. మూడు కమిషనరేట్ల కింద విభజించటం తెలిసిందే. అవి.. హైదరాబాద్.. సైబరాబాద్.. రాచకొండ. ఈ మూడు పోలీసు కమిషనరేట్లకు ముగ్గురు పోలీసు కమిషనర్లు ఉంటారు. ఇప్పుడు చెప్పే శుభవార్త.. ఈ మూడు కమిషనరేట్లలోని హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని హైదరాబాదీయులకు మాత్రమే వర్తించనుంది.

మిగిలిన విషయాలు ఎలా ఉన్నా హైదరాబాద్ రోడ్ల మీద చోటు చేసుకునే ట్రాఫిక్ జాంలను క్లియర్ చేసే కన్నా.. వాహనదారుల మీద చలనాలు బాదేసే పని మీదనే పోలీసులు ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారన్న చెడ్డపేరు ఉంది. ఇందుకు తగ్గట్లే చిన్న చిన్న అంశాల విషయంలోనూ భారీగా చలానాలు బాదేస్తుంటారు. ఇలా బాదేసిన చలానాలు గుట్టలా పేరుకుపోవటమే తప్పించి.. క్లియర్ కావటం అన్నది లేదు. తాజా అంచనాల ప్రకారం చూస్తే.. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పెండింగ్ లో ఉన్న చలానాలు రూ.600 కోట్ల మేర ఉన్నట్లుగా చెబుతారు.

పేరుకు రూ.600 కోట్ల చలనాలు ఉన్నా.. వాటిని చెల్లించే పరిస్థితి లేదు. చెల్లింపులకు లీగల్ యాక్షన్ తీసుకోవాలంటే పెద్ద తతంగమే ఉంటుంది. వీటన్నింటి కన్నా.. తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సరికొత్త ప్రయోగాన్ని అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. దాని ప్రకారం.. ప్రస్తుతం ఉన్న చలానాలపై రాయితీ ఇచ్చి.. పరిమిత కాలంలో వాహనదారులు తమ మీద ఉన్న చలానాల్ని క్లియర్ చేసుకునే అవకాశం ఇస్తే.. ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

దీని కారణంగా పెండింగ్ చలానాలు క్లియర్ కావటంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వీలుందన్న అభిప్రాయం ఇటీవల నిర్వహించిన సమీక్షలో వ్యక్తమైనట్లుగా తెలుస్తోంది. అయితే.. రాయితీలు ఏ విధంగా కల్పించాలి? దానికి అవసరమైన విధివిధానాలు ఎలా ఉంటే బాగుంటుందన్న విషయాలపై అధ్యయనం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

త్వరలోనే ట్రాఫిక్ చలానాలపై రాయితీ నిర్ణయాన్ని హైదరాబాద్ పోలీసులు ప్రకటిస్తారని చెబుతున్నారు. మరి.. హైదరాబాద్ మహానగరం పరిధిలోని సైబరాబాద్.. రాచకొండ కమిషనరేట్లు కూడా ఇదే దారిలో పయనిస్తే బాగుంటుందని చెప్పొచ్చు. మరేం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News