నిర్భ‌య నిందితుల‌కు ఉరి శిక్ష‌లో కూడా ఓ రికార్డుందే!

Update: 2020-01-11 09:54 GMT
దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన నిర్భ‌య నిందితుల ఉరి అంశంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకోనుంది. 2012 నిర్భయ ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ కేసులో నలుగురు దోషులకు ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాల్సిందిగా పటియాల కోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. న‌లుగురికి ఉరిశిక్ష‌ విధించ‌డం స్వాతంత్యం వ‌చ్చిన త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌సారి మాత్ర‌మే జ‌రిగింది. ఆ త‌ర్వాత తాజాగా నిర్భ‌య దోషుల‌ విష‌యంలోనూ అదే జ‌ర‌గ‌నుంది.

1983 అక్టోబ‌ర్ 25వ తేదీన పూణేలో న‌లుగురు దోషుల‌ను ఒకేసారి ఉరి తీశారు. స్వాత్రంత్యం వ‌చ్చిన త‌ర్వాత ఇలా న‌లుగురిని ఒకేసారి ఉరి తీసిన సంద‌ర్భం ఇదే. అనంత‌రం మ‌ళ్లీ తాజాగా నిర్భ‌య దోషుల‌ను ఉరితీస్తున్నారు. ప‌ది మందిని అమానుషంగా చంపిన కేసులో దోషులుగా నిర్ధార‌ణ అయిన రాజేంద్ర జ‌క్క‌ల్‌, దిలీప్ సుతార్‌, శాంతారామ్ జ‌గ్త‌ప్ మ‌రియు మునావ‌ర్ షా ను ఒకే రోజు ఉరికంభం ఎక్కించారు. మ‌ళ్లీ అలాంటి అరుదైన శిక్ష‌ను నిర్భ‌య ఘ‌ట‌న దోషులు అనుభ‌వించ‌నున్నారు. న‌లుగురు దోషుల‌కు ఒకేసారి ఉరిశిక్ష విధించ‌డం దాదాపు 36 సంవ‌త్స‌రాల త‌ర్వాత జ‌రుగుతోంది.

ఇదిలాఉండ‌గా, అయితే, నిర్భయ దోషులు వినయ్‌శర్మ, ముకేశ్‌ ఇద్దరూ త‌మ‌ను ఉరితీయ‌వ‌ద్దంటూ క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. నిర్భయ ఇద్దరు దోషుల క్యూరేటివ్‌ పిటిషన్ల ను సుప్రీంకోర్టు ఈ నెల 14వ తేదీన విచారణ చేపట్టనుంది. జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఛాంబర్‌లో అంతర్గతంగా విచారణ చేపట్టనుంది.

మ‌రోవైపు, నిర్భ‌య దోషులను ప్రతీక్షణం గమనిస్తూ వారిని స్పెషల్‌గా ట్రీట్ చేస్తున్నారు జైలు అధికారులు. ఆ నలుగురు దోషులను ఐసోలేటెడ్ జైళ్లలో ఉంచుతారు .. ఇకపైన వారితో చేయించే రోజువారి జైలు పని చేయించరు... ఉరిశిక్ష పడే వరకు నలుగురిని విడివిడిగా కండమ్ సెల్‌లో ఉంచనున్నారు.. ఇక, 24 గంటలు వీరిని జైలర్ పర్యవేక్షిస్తూ ఉంటారు.. 22న ఉరి శిక్ష పడేంత వరకు వీరితో ఎవ్వరూ మాట్లాడరు... అలాగే వీరిని ఎవరితో కలవనివ్వరు.. క్షణక్షణం మృత్యువు గురించి మాత్రమే ఆలోచించేలా జైలు అధికారులు పరిస్థితులు కల్పిస్తారు. అంతేకాకుండా ఉరిశిక్ష అమలు అయ్యేంతవరకు ఈ నలుగురు దోషుల శారీరక మానసిక ఆరోగ్య పరీక్షలు జరుపుతూ ఉంటారు. ఈ నలుగురు దోషులకు దగ్గర ఏమైనా ఆస్తి ఉంటే ఆస్తి ఎవరి పేరున రాయాలి అనుకుంటున్నారు అని కనుక్కుని ఆ మేరకు వారితో విల్లు రాయిస్తారు... వారి చివరి కోరికను అడిగి తెలుసుకుంటారు.. అలాగే తమ కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరిని మాత్రమే కలవాలి అనుకుంటే ఒక్కసారి మాత్రమే కలవడానికి అవకాశం కల్పిస్తారు.


Tags:    

Similar News