చినబాబుకు ప్ర‌ధాని ప‌ద‌వి ఏం వ‌ద్దంట‌

Update: 2017-02-05 05:26 GMT
వార‌సత్వ రాజ‌కీయాల‌ను తారాస్థాయికి తీసుకువెళ్లిన స‌మాజ్ వాదీ పార్టీ నుంచి ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. తండ్రిపై తిరుగుబాటు బావుట ఎగుర‌వేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తాజాగా మ‌రింత పెద్ద ప‌ద‌విపై త‌న క్లారిటీ ఇచ్చారు. దేశానికి ప్రధాన మంత్రి కావాలన్న కోరిక తనకు లేదని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న తపనే తప్ప జాతీయ రాజకీయాలపై ఎంతమాత్రం ఆసక్తిలేదని ఆయన వెల్లడించారు. ‘ఉత్తర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే నా ధ్యేయం. దేశానికి ప్రధాన మంత్రిని కావాలన్న కోరిక నాకు లేదు’ అని ఓ న్యూస్ చానల్‌ తో మాట్లాడుతూ చెప్పారు.

ప్ర‌స్తుతం జరుగుతున్న ఎన్నికల్లో సమాజ్‌ వాదీ పార్టీ - కాంగ్రెస్ కూటమి బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తుందని, 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో 300కు పైనే సీట్లు గెలుచుకుంటామని అఖిలేశ్ ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ఫలాలు 50 శాతం మందికి పైగా ప్రజలకు లబ్ధి చేకూర్చాయని, వారంతా ఓట్లేస్తే మూడొందలకు పైగా సీట్లు తమకే వస్తాయని ఎస్‌పీ అధినేత జోస్యం చెప్పారు. తన ఐదేళ్ల పదవీకాలంలో అమలుచేసిన సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. సమాజ్‌ వాదీ పెన్షన్ కింద 55 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరిందన్నారు. 18 లక్షల మందికి ల్యాప్‌టాప్‌లు ఇచ్చామని, ఎంబీబీఎస్ సీట్లు రెట్టింపుచేశామని, 108 - 100 హెల్ప్  లైన్లు విజయవంతంగా అమలుచేసినట్టు అఖిలేశ్ పేర్కొన్నారు. కన్న విద్యాధన్ యోజన వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజాదరణ పొందాయని - లక్షలాది మంది ప్రయోజనం పొందినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఎస్‌ పి వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ తో వచ్చిన విభేదాలపై మాట్లాడుతూ ‘అవన్నీ సమసిపోయాయి. తండ్రి-కుమారుడి బంధం ముందు అవేనీ నిలవలేదు. ములాయం ఆశీస్సులు నాకు శ్రీరామరక్ష’ అని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News