'వ్యాక్సిన్' వేసుకుంటేనే...ప్రభుత్వ ఉద్యోగులకు జీతం, లేకపోతే లేనట్టే ?

Update: 2021-06-23 11:01 GMT
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. మొదటి వేవ్ , సెకండ్ వేవ్ అంటూ దేశాన్ని గజగజ వణికించింది. అయితే , కరోనా మహమ్మారి కట్టడికి మన దగ్గర ఉన్న ఏకైక మార్గం కేవలం వ్యాక్సిన్ మాత్రమే. కాబట్టి దేశవ్యాప్తంగా శరవేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. కరోనా  కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ లు  భారీగా  అమలు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్ కేంద్రాల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వ్యాక్సిన్ అందిస్తున్నారు.

వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు మధ్యప్రదేశ్‌ లోని ఉజ్జయిని జిల్లాలో సంచలన ప్రకటన చేశారు. ఉజ్జయిని జిల్లా కార్యాలయం వ్యాక్సినేషన్ విషయంలో సంచలన  నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ టీకా వేయించుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే జూలై నెల జీతం అందజేయబడుతుందని , ఈ మేరకు ఉజ్జయని జిల్లా కలెక్టర్‌ ఆశీష్‌ సింగ్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు జూలై 31 వరకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోకపోతే జూలై నెల జీతం పంపిణీ చేయబడదని జిల్లా అధికారులు వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్టుగా వ్యాక్సిన్ సర్టిఫికేట్ అందజేయాల్సి ఉంటుంది. జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని..ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని జిల్లా కలెక్టర్ ఆశీష్ సింగ్ తెలిపారు. జూన్ నెలకు జీతాల పంపిణీతో పాటు వ్యాక్సిన్ సర్టిఫికేట్లు సేకరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు  కూడా వచ్చాయి. 
Tags:    

Similar News