అనంత‌పురం అయిపోయిందా ప‌వ‌న్‌?

Update: 2018-05-09 08:50 GMT
రాజ‌కీయ పార్టీ పెట్ట‌టం పెద్ద విష‌యం కాదు. దాన్ని న‌డిపించ‌టం అంతే తేలికైన విష‌యం కాదు. ఎంతో యంత్రాంగం.. మ‌రెంతో మంత్రాంగం ఉండాల్సిందే. జ‌న‌సేన పార్టీని స్టార్ట్ చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఏళ్ల త‌ర‌బ‌డి పార్టీకి సంబంధించి వ‌న్ మ్యాన్ షో చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌ల కాలంలో పార్టీని విస్త‌రిస్తున్న ఆయ‌న‌.. జ‌న‌సేన‌కులు ఉత్సాహాన్ని స‌రైన మార్గంలో పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఎందుక‌లా అంటే.. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామంగా చెప్ప‌క త‌ప్ప‌దు. కృష్ణా జిల్లా జ‌న‌సేన పార్టీ ఇన్ ఛార్జ్ ముత్తంశెట్టి మాట్లాడుతూ ప‌వ‌న్ క‌ల్యాణ్ కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ నుంచి బ‌రిలో నిల‌వ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు.

అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన‌ను మ‌రింత బ‌లోపేతం చేసేందుకు కార్యాచ‌ర‌ణ‌ను రూపొందిస్తున్న‌ట్లుగా చెప్పారు.  గ‌మ‌నించాల్సిన విష‌యం ఏమిటంటే.. తాను అనంత‌పురం జిల్లా నుంచి పోటీ చేస్తాన‌ని గ‌తంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. తిరుప‌తి నుంచి పోటీ చేస్తార‌న్న మాట వినిపించినా.. అది నిజం కాద‌న్న మాటను పార్టీ నేత‌లు చెబుతున్నారు. అనంత‌పురం జిల్లాలోని అనంత‌పురం అర్బ‌న్ నుంచి బ‌రిలోకి దిగేందుకు ప‌వ‌న్ రెఢీ అంటున్న వేళ‌.. ఇందుకు భిన్నంగా అవ‌నిగ‌డ్డ నుంచి పోటీ చేస్తానంటూ పార్టీ నేత ఒక‌రు ప్ర‌క‌టించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

అయినా.. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు భిన్నంగా పార్టీకి చెందిన జిల్లా స్థాయి నేత ఒక‌రు అధినేత పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గం గురించి ఎలా మాట్లాడ‌తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ త‌ర‌హా ప్ర‌క‌ట‌న‌లు పార్టీకి లేని పోని ఇబ్బందులు తెచ్చి పెడ‌తాయ‌ని మ‌ర్చిపోకూడ‌దు. మ‌రి..త‌మ పార్టీ నేత మాట‌పై జ‌న‌సేన అధికారికంగా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News