చిన్నమ్మ మరోసారి పార్టీ భజన చేశారు

Update: 2016-09-06 05:15 GMT
పార్టీ ముఖ్యమా? ప్రజలు ముఖ్యమా? అన్న సూటి ప్రశ్నకు చాలామంది నాయకులు ప్రజలే ముఖ్యమని చెబుతుంటారు. కొందరు మాత్రం పార్టీనే ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. మాటలకు చేతలకు ఏ మాత్రం పొంతన లేనట్లుగా వ్యవహరించే నేతలకు పూర్తి భిన్నంగా చిన్నమ్మగా సుపరిచితురాలైన పురంధేశ్వరి. ఆమె మాటల్లోనూ.. చేతల్లోనూ తానున్న పార్టీ పట్ల అమితమైన విధేయతను ప్రదర్శిస్తారు. తన మాటలు ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నా ఆమె పెద్దగా పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తారు.

విభజన సమయంలో తన చేతకానితనాన్ని స్పష్టంగా ప్రదర్శించిన ఆమె తీరు సీమాంద్రులకు కడుపు మండేలా చేసింది. ఈ కారణంతోనే కావొచ్చు.. అప్పటివరకూ రెండుసార్లు గెలిపించిన ఆమెను ప్రజలు తిరస్కరించటం కనిపిస్తుంది. దేశమంతా మోడీ హవా నడుస్తున్న వేళ.. ఆయన పార్టీ నుంచి పోటీ చేసి మరీ ఓడిపోవటం చూస్తే చిన్నమ్మ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది. ప్రజల్లో వ్యతిరేకతతో పాటు.. ఆమె బరిలోకి దిగిన నియోజకవర్గం కూడా ప్రత్యేకమైనది కావటంతో ఓటమి అనివార్యమైంది.

తన ఇమేజ్ ను తానే చేజేతులారా పాడు చేసుకుంటున్న వైనాన్ని చిన్నమ్మ ఇప్పటికి గుర్తించలేదన్న వాదన వినిపిస్తోంది. ప్రత్యేక హోదా అంశంపై ఏపీ ప్రజలు ఎలాంటి మైండ్ సెట్ లో ఉన్నారో తెలిసిందే. హోదా అన్నది ఒక భావోద్వేగ అంశంగా మారినప్పటికీ.. ఆ విషయాన్ని పట్టించుకోని రీతిలో చిన్నమ్మ వ్యాఖ్యలు చేయటం విస్మయానికి గురి చేస్తుందనే చెప్పాలి. హోదా తప్ప ఇంకేదీ తమకు సంతృప్తిని ఇవ్వదన్న తీరులో సీమాంధ్రులు వ్యవహరిస్తున్నా ఆమె మాత్రం ఆ విషయాన్ని అస్సలు గుర్తించినట్లుగా కనిపించటం లేదనే చెప్పాలి.

తాజాగా మాట్లాడిన ఆమె.. హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ అంటూ చెప్పుకొచ్చారు. హోదా ఇవ్వటం కుదరకపోతే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వటానికి కేంద్రం సిద్ధంగా ఉందన్న మాటను ఆమె చెప్పారు. ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే.. హోదా కాకుండా ప్యాకేజీ అన్న మాట చెప్పటానికి బాగానే ఉన్నప్పటికీ వాటిని సీమాంధ్రులు ఎలా రెస్పాండ్ అవుతారన్న విషయాన్ని చూసుకోకుండా చిన్నమ్మ మాట్లాడినట్లుగా కనిపిస్తుంది. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటంటూ చిన్నమ్మ నోటి నుంచి వచ్చే మాటలు వింటే ఆమె తప్పు ఇట్టే అర్థమవుతుంది.

విభజన లాంటి భారీనష్టం ఏపీకి జరిగింది. ఆ విషయాన్ని మిగిలిన రాష్ట్రాలతో పోలిక పెట్టుకోలేం. కానీ.. అలాంటివేవీ పట్టించుకోని పురంధేశ్వరి.. తాను చెప్పదలుచుకున్నది చెప్పుకుంటూ వెళుతున్నారు. ప్రత్యేక హోదా అనే పదానికి 14వ ఆర్థిక సంఘంలో అర్థమే లేదని ఆమె చెప్పటమే నిదర్శనంగా చెప్పొచ్చు. రూ.16వేల కోట్లు లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీకి కేంద్రం ఇప్పటికే రూ.4వేల కోట్లు ఇచ్చిందంటూ చెబుతున్న ఆమె లోటు మొత్తాన్ని2019నాటికి కేంద్రం భర్తీ చేస్తుందని చెప్పటం గమనార్హం. వాస్తవ అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా పార్టీ భజనతో తరిస్తున్నట్లుగా ఉండే చిన్నమ్మ మాటలు సీమాంధ్రుల్ని చిరాకు పుట్టిస్తున్నాయి. ఆ విషయాన్నిఆమె ఎప్పటికి గుర్తిస్తారన్నదే పెద్ద ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News