ఆ సీఎం గుండె ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే

Update: 2020-06-28 02:30 GMT
విపత్తు విరుచుకుపడుతున్న వేళ..దాని సంగతి చూసే వరకూ మరే అంశానికి ప్రాధాన్యత ఇవ్వకుండా పాలన చేసే పాలకుల్ని చూసి ఉంటాం. డిజిటల్ జమానాలో ఇప్పుడు సీన్లు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఓపక్క మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తున్న వేళ.. కీలక సదస్సుల్లో పాల్గొనటానికి తన వివాహాన్ని సైతం వాయిదా వేసుకున్న డెన్మార్క్ ప్రధాని లాంటివాళ్లు కనిపిస్తుంటే.. అందుకు భిన్నమైన సీన్ దేశంలో కనిపిస్తోంది.

మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  శివరాజ్ సింగ్ చౌహాన్ ను గమనిస్తున్నారా? గడిచిన మూడురోజులుగా ఆయన రెండు తెలుగు  రాష్ట్రాల్లోనే ఉంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని వదిలి పక్కకు వెళ్లలేని పరిస్థితి. అందుకు భిన్నంగా ఆయన మాత్రం గుళ్లు.. గోపురాలు.. స్వాములోరి చుట్టూ తిరుగుతున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారులోని త్రిదండి చిన జీయర్ స్వామి వారి ఆశ్రమానికి వచ్చిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దాదాపు ఒకటిన్నర రోజుల పాటు గడిపినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత తాపీగా ఒక ఆశ్రమానికి వచ్చి గడపటం ఆశ్చర్యమంటున్నారు. అదే సమయంలో మరో పరిణామం చోటు చేసుకుంది. జీయర్ స్వామిని శివరాజ్ సింగ్ కలిసిన సందర్భంలో అక్కడే మైహోం గ్రూఫు ఛైర్మన్ తో పాటు.. మెగా సంస్థల అధినేత సైతం అక్కడే ఉన్నారు. వాస్తవానికి ఈ ఇద్దరు వ్యాపార ప్రముఖులు తరచూ జీయర్ ఆశ్రమం వద్దనే ఉంటారు. కానీ..ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన కార్యక్రమానికిదగ్గరగా ఉండి అన్ని చూసుకోవటం విశేషంగా చెప్పాలి. జీయర్ ఆశ్రమం తర్వాత.. తిరుమలకు వచ్చిన ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. వణికిస్తున్న మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ.. ఒకరాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా జర్నీ చేయటం శివరాజ్ సింగ్ చౌహాన్ కు మాత్రమే సాధ్యమవుతుందేమో?
Tags:    

Similar News