అమ్మ కోసం ఆసుపత్రికి స్టాలిన్..వైగో వచ్చారు

Update: 2016-10-09 05:09 GMT
కాస్త అటుఇటూగా ఇరవై రోజుల నుంచి చెన్నై అపోలో ఆసుపత్రిలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి - అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు పరామర్శల పర్వం మొదలైంది. మొన్నటి వరకూ అమ్మ ఆరోగ్యంపై అనేక సందేహాలు వెల్లువెత్తటంతో పాటు.. ఆమె త్వరలోనే బయటకు వస్తారన్న ఆశ ఉండేది. అయితే..  రానున్న కొద్ది వారాల వరకూ ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం లేదన్న విషయం స్పష్టమైన పరిస్థితి.

మొన్నటికి మొన్న (శుక్రవారం) యూపీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఢిల్లీకి వచ్చేసి.. సోనియమ్మ తరఫున ‘అమ్మ’ను పరామర్శించి.. ఆమె త్వరగా కోలుకోవాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఇవాళో.. రేపో ప్రధాని మోడీ సైతం అమ్మను పరామర్శించేందుకు చెన్నైకి రానున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారమేమీ బయటకు రాలేదు.

ఇదిలా ఉండగా.. అమ్మ ఆరోగ్యం గురించి వాకబు చేయటంతో పాటు.. ఆమెను పరామర్శించేందుకు డీఎంకే అధినేత కరుణానిధి కుమారుడు.. విపక్షానికి చెందిన కీలక నేత అయిన స్టాలిన్..   ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగోలు శనివారం అపోలోకు వచ్చి పరామర్శించారు. రాజకీయంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే తత్వం ఉన్న అమ్మ రాజకీయ ప్రత్యర్థులు ఆసుపత్రికి రావటం.. అన్నాడీఎంకే వర్గాలను కలిసి.. అమ్మ త్వరగా కోలుకోవాలని కోరుకోవటంతో పాటు.. ఆమెకు వైద్య సేవలు అందిస్తున్న అపోలో వైద్య బృందాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాహుల్ తో సహా.. స్టాలిన్.. వైగో లాంటి ముఖ్య నేతలు అపోలోకు వస్తున్నా.. అమ్మను దూరం నుంచి కూడా చూడటం లేదని.. వైద్యులతో మాట్లాడి వెళ్లిపోతున్నట్లుగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News