టీజీ వెంకటేశ్ గ‌న్ మ్యాన్ కుమార్తె షాకింగ్ నిర్ణ‌యం

Update: 2017-05-06 06:01 GMT
ఏపీ తెలుగుదేశం పార్టీ నేత‌.. రాజ్య‌స‌భ స‌భ్యుడు.. క‌ర్నూలు రాజ‌కీయ నేత‌ల్లో కీల‌క‌మైన టీజీ వెంక‌టేశ్ గ‌న్ మ్యాన్ కుమార్తె తీసుకున్న దారుణ నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారింది. గ్రూప్ 2 ప‌రీక్ష స‌రిగా రాయ‌లేద‌న్న చిన్న కార‌ణానికి దారుణ నిర్ణ‌యాన్ని తీసుకొని అయిన‌వారికి పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. టీజీ వెంక‌టేశ్‌ కు గ‌న్ మ్యాన్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు ఐజ‌య్య‌. క‌ర్నూలు ప‌ట్ట‌ణంలోని స్టాంట‌స్ పురంలో ఉండే ఐజ‌య్య ఆర్మీలో ప‌ని చేసి రిటైర్ అయ్యారు. ఆయ‌న‌కు ఒక కొడుకు.. ఒక కుమార్తె ఉన్నారు. 29ఏళ్ల కుమార్తె సుచ‌రిత ఎమ్మెఎస్సీ బీఈడీ చ‌దువుకుంది. పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అవుతోంది.

ఇంటి ద‌గ్గరే ఉండి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్న ఆమె.. గ్రూప్ 2 ప‌రీక్ష స‌రిగా రాయ‌లేద‌న్న ఆవేద‌న‌లో ఉంది. శుక్ర‌వారం తండ్రి ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన వెంట‌నే.. తండ్రి రివాల్వ‌ర్‌ను తీసుకొని క‌ణ‌త‌ల‌కు గురి పెట్టుకొనిపేల్చేసుకుంది. ఈ ఘ‌ట‌న తెలిసిన వెంట‌నే ఆమెను కాపాడేందుకు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి హుటాహుటిన తీసుకెళ్లారు. అనంత‌రం మెరుగైన వైద్య‌సేవ‌ల కోసం ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.

ఆమె మ‌ర‌ణించిన‌ట్లుగా వైద్యులు వెల్ల‌డించారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు.. రివాల్వ‌ర్ ను.. బుల్లెట్ల‌ను సేక‌రించి.. ప్రాధ‌మిక ద‌ర్యాప్తు నిర్వ‌హించారు. గ్రూప్ 2 ఎగ్జామ్‌కు స‌రిగా ప్రిపేర్ కాలేద‌న్న బాధ‌తోనే ఇంత దారుణానికి పాల్ప‌డిన‌ట్లుగా భావిస్తున్నారు. కేసు న‌మోదు చేసిన అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News