గులాబీలో గుబులుః ఎమ్మెల్సీ పోరులో విజ‌య‌మా? వీర స్వర్గమా?

Update: 2021-03-14 06:30 GMT
గ‌త‌మెంతో ఘ‌నం అన్న‌మాట టీఆర్ ఎస్ ప్ర‌స్తుత ప‌రిస్థితికి స‌రిగ్గా స‌రిపోతుంది. అటు అసెంబ్లీలో కారు జోరుకు ఎదురేలేదు. ఇటు ప్ర‌జాక్షేత్రంలో తిరుగేలేదు. ఎన్నిక‌లు ఏవైనా స‌రే.. గంప‌గుత్త‌గా గులాబీ పార్టీకే ఓట్లు.. సీట్లు అన్న‌ట్టుగా ఉండేది ప‌రిస్థితి. కానీ.. ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఆరేళ్ల‌ పాల‌న‌లో వ‌చ్చే స‌హ‌జ వ్య‌తిరేక‌త‌తోపాటు అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వ‌లేద‌న్న అభిప్రాయం కూడా గ‌ట్టిగానే ఉంది. మ‌రోవైపు.. దుబ్బాక‌, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ప‌ట్టు జారిపోతోందా? అనే అనుమానాలు మ‌రోవైపు. వెర‌సి.. ఇప్పుడు రెండు ఎమ్మెల్సీ స్థానాల‌కు జ‌రుగుతున్న ఎన్నిక అంద‌రిక‌న్నా టీఆర్ఎస్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది.

రెండో ఆప్ష‌నే లేదు.. రెండు స్థానాల్లోనూ గెలిచి తీరాల్సిందే అన్నట్టుగా ఉంది ప‌రిస్థితి. అయితే.. గ‌తంలో మాదిరిగా గెలుపు న‌ల్లేరుపై న‌డ‌క కాద‌న్న సంగ‌తి అంద‌రితోపాటు పార్టీ అధిష్టానం కూడా గుర్తించింది. అందుకే.. బాధ్య‌త‌లు తీసుకున్న వారికి క‌ఠిన ఆదేశాలు జారీచేసింద‌ట‌. నోట్లు పంచండి.. ఓట్లు కొనండి అంటూ వైరా ఎమ్మెల్యే కార్య‌క‌ర్త‌ల‌కు చేసిన సూచ‌న‌లు కూడా ఈ ఫ‌లిత‌మే అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. దీన్నిబ‌ట్టే.. టీఆర్ఎస్ ఎంత ఒత్తిడిలో ఉందో అర్థ‌మ‌వుతోంద‌ని అంటున్నారు.

అయితే.. రెండు చోట్లా విజ‌యం అంత సులువుగా ద‌క్కేలా లేదు. ఇందులో ప్ర‌ధానంగా.. హైదరాబాద్‌– రంగారెడ్డి– మహబూబ్‌నగర్ నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాలి. ఇక్క‌డ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచీ ఒక్క‌సారి కూడా విజ‌యం సాధించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి 2007, 2009, 2015లో ఎన్నిక జ‌రిగింది. ఇందులో రెండుసార్లు టీఆర్ ఎస్ ఓడిపోగా.. 2009లో మాత్రం పోటీకి దూరంగా ఉండిపోయింది. ఇప్పుడు నాలుగోసారి ఎన్నిక జ‌రుగుతోది. 2007లో పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాల‌వ్వ‌గా.. 2009లో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు టీఆర్‌ఎస్‌ మద్దతునిచ్చింది. ఆయన విజ‌యం సాధించారు. 2015లో టీఎన్జీవోస్‌ యూనియన్‌ అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ను ఉద్యోగానికి రాజీనామా చేయించి టీఆర్‌ఎస్‌ తరపున బరిలోకి నిలిపినా విజ‌యం దక్కలేదు. దీంతో.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల ప్ర‌కారం గులాబీ పార్టీ గెలిచి తీరాల్సి ఉంది.

మ‌రోవైపు వ‌రంగ‌ల్‌-నల్గొండ‌-ఖమ్మం నియోజ‌క‌వ‌ర్గంలోనూ అంత అనువైన ప‌రిస్థితి లేదు. ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి రెండోసారి బ‌రిలో ఉండ‌డం.. కోదండ‌రామ్‌, తీన్మార్ మ‌ల్ల‌న్న లాంటి వారు బ‌ల‌మైన‌ ప్ర‌త్య‌ర్థులుగా ఉన్నారు. మ‌రోవైపు కాంగ్రెస్‌, బీజేపీకి ఎలాగూ సాంప్ర‌దాయ ఓటింగ్ ఉండ‌నే ఉంది. ఈ ప‌రిస్థితుల‌ను ఎదురొడ్డి గెలుపు సాధించ‌డం గుల‌బీ ద‌ళానికి స‌వాల్ గా మారింది. ఈ రెండు స్థానాల్లో గెలిచి, త‌మ బ‌లం త‌గ్గ‌లేద‌ని నిరూపించాల‌ని చూస్తోంది టీఆర్ఎస్. త‌ద్వారా.. రాబోయే నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌లోనూ స‌త్తా కొన‌సాగించాల‌ని ఆరాట‌ప‌డుతోంది.

ఇవాళ ఉద‌యం మొద‌లైన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ పోలింగ్ సాయంత్రం 4 గంగ‌ల వ‌ర‌కు సాగ‌నుంది. మొత్తం 10 ల‌క్ష‌లా 36 వేల 833 మంది ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు. రెండు స్థానాల్లో క‌లిపి 164 మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిల‌వ‌డం విశేషం. మొత్తం 1835 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ఈ నెల 17న ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు. ఈ దెబ్బ‌తో.. యువ‌త‌, నిరుద్యోగులుగా ఉన్న ప‌ట్ట‌భ‌ద్రులు టీఆర్ఎస్ ను ఎంత మేర విశ్వ‌సిస్తున్నారో తేలిపోనుంది.
Tags:    

Similar News